Rohit Sharma : టీమిండియా దిగ్గజ ఓపెనర్, హిట్మాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ రిటైర్మెంట్ గురించి రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ, తన పవర్ఫుల్ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. భారత్ ఈ వన్డే సిరీస్ను 2-1తో చేజార్చుకున్నప్పటికీ, రోహిత్ ఫామ్లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. అయితే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ ఇంగ్లాండ్లోనే ఉండిపోవడం విశేషం.
లండన్లో నీతా అంబానీతో భేటీ
లార్డ్స్లో ఆఖరి వన్డే ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ది ఓవల్ మైదానానికి చేరుకున్నాడు. అక్కడ జరుగుతున్న ద హండ్రెడ్ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీతో రోహిత్ భేటీ అయ్యాడు. మ్యాచ్ చూస్తూనే వీరిద్దరూ చాలా సేపు ముచ్చటించారు. నీతా అంబానీ, రోహిత్ శర్మ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మారబోతోందా?
రోహిత్ శర్మ, నీతా అంబానీ లండన్లో కలవడంతో ఐపీఎల్ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కానీ రెండు సీజన్ల క్రితం అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. అయితే హార్దిక్ నాయకత్వంలో ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర నిరాశపరిచింది. దీంతో రాబోయే సీజన్ కోసం హార్దిక్ను పక్కనపెట్టి ముంబై కెప్టెన్ను మార్చే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
హిట్మాన్ మళ్లీ కెప్టెన్ అవుతాడా?
లండన్ భేటీ తర్వాత ముంబై ఇండియన్స్ బాధ్యతలను మళ్లీ రోహిత్కు అప్పగిస్తారా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే టీమ్ మేనేజ్మెంట్ వైపు నుంచి తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. ఒకవేళ ముంబై యాజమాన్యం మళ్లీ కప్తాన్సీ ఆఫర్ చేస్తే రోహిత్ శర్మ తీసుకుంటాడా? లేదా తిలక్ వర్మ లాంటి యువ క్రికెటర్ను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దడానికి మార్గం సుగమం చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి