
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా.. పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుండగా.. ఇప్పుడు నగరానికి ఐకానిక్ గుర్తింపునిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది. 64వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పీపీపీ మోడల్లో రోప్వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ దిశలో కీలక ముందడుగుగా మారింది.
ఆకాశ మార్గంలో రాజధాని
విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్.. అక్కడి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం.. పున్నమి ఘాట్.. భవానీ ఐలాండ్.. చివరకు వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వరకు రోప్వే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మోడల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది.
టూరిజమే లక్ష్యం
రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాలు పెరిగే కొద్దీ నగరంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే సాధారణ మౌలిక వసతులతో పాటు.. పర్యాటకులను ఆకర్షించే ఐకానిక్ ప్రాజెక్టులను తీసుకొస్తోంది.
ఐకానిక్ ప్రాజెక్టుల వరుస
రోప్వేతో పాటు లండన్ ఐ తరహా భారీ వీల్, మినీ అమెజాన్ థీమ్ ప్రాజెక్టులను కూడా అమరావతిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే టెండర్ల దశకు చేరుకున్నాయి. రాజధానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
రవాణా.. వినోదం రెండు..!
రోప్వే కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు. నగరంలోని ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగానూ ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కృష్ణా నది అందాలను ఆస్వాదించే అవకాశం కూడా ఈ ప్రాజెక్టుతో లభించనుంది.
భవిష్యత్ నగరానికి బాటలు
ఒక కోటి జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలతో మెగా సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కొత్త వంతెనలు, డేటా సెంటర్లు, 5జీ నెట్వర్క్, క్వాంటమ్ వ్యాలీ, ఐకానిక్ టూరిజం ప్రాజెక్టులు… ఇవన్నీ కలిసి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి బాటలు వేస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. పరిపాలనా రాజధాని నుంచి పర్యాటక రాజధాని వైపు… అమరావతి మరో అడుగు ముందుకేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..