కృతజ్ఞత, మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ‘హిజ్రా’ పాటలో కలిసి పనిచేసిన గబ్బర్ సింగ్ రమేష్ను కష్టకాలంలో ఆదుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ పరిస్థితి తెలుసుకున్న వెంటనే స్పందించారు రాహుల్. రమేష్ చికిత్స కోసం వెంటనే రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. “కలిసి పనిచేసిన వారిని మరచిపోకుండా అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఈ క్రమంలో గబ్బర్ సింగ్ రమేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.గబ్బర్ సింగ్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన రమేష్ గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడంతో కుటుంబ సభ్యులు అతనిని వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రమేష్ కు అండగా నిలిచారు. వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి చికిత్స ఖర్చుల కోసం రమేష్ సతీమణికి తన తరఫున రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా చేస్తానని రమేష్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు చిరంజీవి.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం రమేష్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే మరో మెగా బ్రదర్ నాగబాబు మరో రూ. 2 లక్షల చెక్కును అందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. కాగా రమేష్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అతనికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది గబ్బర్ సింగ్ గ్యాంగ్ టీమ్. రమేష్ కు కావాల్సిన అవసరాలను సమకూరుస్తున్నారు. అలాగే అతని ఫ్యామిలీకి ధైర్యం చెబుతున్నారు. మరి అభిమానుల ప్రార్థనలు ఫలించి గబ్బర్ సింగ్ రమేష్ త్వరగా కోలుకోని మళ్లీ మామూలు మనిషి కావాలని, సినిమాల్లో నటించాలని అందరమూ కోరుకుందాం.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి