Headlines

జీవితమంతా ముగ్గురు కుమార్తెల కోసమే.. చివరికి వీడియో కాల్‌లోనే తండ్రికి వీడ్కోలు..! | Haryana: Elder Man dies in Sonipat old age home, daughters watched father’s funeral on video call after pay Rs 5100

జీవితమంతా ముగ్గురు కుమార్తెల కోసమే.. చివరికి వీడియో కాల్‌లోనే తండ్రికి వీడ్కోలు..! | Haryana: Elder Man dies in Sonipat old age home, daughters watched father’s funeral on video call after pay Rs 5100


తన ముగ్గురు కుమార్తెలకు మంచి విద్య అందించి, జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బతికిన ఓ తండ్రి చివరికి ఒంటరిగా కన్నుమూశాడు. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆయన అంత్యక్రియలకు ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరు కూడా ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైలో ఉన్న వారు వీడియో కాల్ ద్వారానే తమ తండ్రికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని సోనిపత్‌లో చోటుచేసుకుంది.

ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తా గత ఏడాదిన్నరగా సోనిపత్‌లోని వెస్ట్ రామ్ నగర్‌లో సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. ఆయన భార్య మీనా కొంతకాలం క్రితమే మరణించడంతో ఒంటరిగా అక్కడే జీవనం సాగిస్తున్నారు. వయోభారంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న గుప్తా మంగళవారం (ఆగస్టు 04) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణించిన వెంటనే వృద్ధాశ్రమం నిర్వాహకులు ముగ్గురు కుమార్తెలకు సమాచారం అందించారు. అయితే ప్రయాణానికి వీలు కాదని, సోనిపత్‌కు రావడం సాధ్యం కాదని వారు తెలిపారు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు, స్థానిక సామాజిక కార్యకర్తల సహకారంతో గుప్తా అంత్యక్రియలను నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా కుమార్తెలకు ప్రత్యక్ష ప్రసారం చేశారు. వారు దూరం నుంచే తండ్రి దహన సంస్కారాలను వీక్షించి వీడ్కోలు పలికారు.

శివచరణ్ గుప్తా తన కుమార్తెలతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ తెలిపారు. అయితే ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆ సంభాషణలు తగ్గిపోయాయని చెప్పారు. దాదాపు 20 రోజుల ముందే ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా, వారు వచ్చి చూడలేదని వెల్లడించారు.

గుప్తాకు కుమారుడు లేకపోవడంతో తన జీవితాన్నంతా ముగ్గురు కుమార్తెల భవిష్యత్తు కోసమే అంకితం చేశారు. వారిని చదివించి ఉన్నత విద్య అందించారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అనిత నేపాల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, రెండో కుమార్తె నిషా ఉత్తరప్రదేశ్‌లో, చిన్న కుమార్తె ప్రియ ముంబైలో తమ తమ కుటుంబాలతో స్థిరపడ్డారు. తండ్రి అంత్యక్రియలు సక్రమంగా నిర్వహించాలని కోరుతూ అనిత ఫోన్‌లో మాట్లాడిన తీరు అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆన్‌లైన్ ద్వారా రూ.5,100 పంపించి చేతులు దులుపుకున్నట్లు వ్యవహరించింది. అనంతరం అంత్యక్రియల వీడియోలను కూడా తమకు పంపాలని వృద్ధాశ్రమాన్ని కోరారు.

‘‘ఇంకా ఎంత సమయం పడుతుంది.. త్వరగా అంత్యక్రియలు పూర్తిచేయండి.. మేము భోజనం చేయాలి..!’’ అంటూ వీడియో కాల్‌లో మాట్లాడిన ముగ్గురు కుమార్తెల తీరు హృదయాలను కలచివేస్తోంది. తండ్రి అంత్యక్రియలకు ముగ్గురు కుమార్తెలు ఎవరూ ప్రత్యక్షంగా హాజరుకాలేదు. పెద్ద కుమార్తె ఆన్‌లైన్‌లో డబ్బు పంపగా, వృద్ధాశ్రమం యాజమాన్యం స్థానికుల సహాయంతో దహన సంస్కారాలు నిర్వహించింది. కుమార్తెలు వీడియో కాల్‌లోనే తండ్రికి చివరి వీడ్కోలు పలికారు. అస్థికలను కూడా తామే తీసుకెళ్లకుండా గంగానదిలో నిమజ్జనం చేయాలని కోరారు. ఈ ఘటన కుటుంబ బంధాలు, మానవీయ విలువలపై తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఇదిలావుంటే, గుప్తా కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన కళ్లను మరణానంతరం దానం చేశారు. దీంతో ఆయన చూపు అవసరమైన మరో వ్యక్తికి వెలుగునివ్వనుంది. అలాగే మొదట అస్థికలను భద్రపరచాలని కోరిన కుమార్తెలు, అనంతరం తాము రావడం సాధ్యం కాదని చెప్పి వాటిని గంగానదిలో నిమజ్జనం చేయాలని వృద్ధాశ్రమ యాజమాన్యాన్ని అభ్యర్థించారు. జీవితాంతం పిల్లల కోసమే కష్టపడిన తండ్రికి చివరికి వీడియో కాల్ ద్వారానే వీడ్కోలు పలకాల్సి వచ్చిన ఈ ఘటన పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *