ఏలూరు జిల్లా పాపికొండలు పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ హైటెక్ మెగా ఆపరేషన్ చేపట్టింది. రాజమండ్రి సీసీఎఫ్ డాక్టర్ టి. జ్యోతి, ఏలూరు డీఎఫ్ఓ సందీప్ రెడ్డి పర్యవేక్షణలో మహారాష్ట్ర, బెంగళూరు నిపుణులతో సహా 350 మందికి పైగా సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు.
ఈ మెగా ఆపరేషన్లో మహారాష్ట్ర, బెంగళూరు నగరాల నుంచి వచ్చిన జాతీయ స్థాయి అటవీ నిపుణులతో పాటు 350 మందికి పైగా సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్నారు. బహుళ అంచెల హైటెక్ వ్యూహాలు సిద్ధం చేశారు. డబుల్ రెక్టాంగిల్ వ్యూహంతో పులి కదలికలను పూర్తిగా కట్టడి చేసేందుకు అంతర్గత, వెలుపలి సరిహద్దులుగా ప్రాంతాన్ని విభజించి దట్టమైన ముట్టడిని ఏర్పాటు చేశారు.
స్టార్ షేప్, యు-షేప్ గాలింపు చేపట్టారు. పులి చివరగా కనిపించిన ప్రాంతం ఆధారంగా స్టార్ షేప్, యు-షేప్ నమూనాల్లో గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. దట్టమైన అడవిలో పులిని గుర్తించడానికి థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, వాకీ-టాకీలను వినియోగిస్తున్నారు.
అంతేకాదు.. ప్రత్యేక వలలతో నెట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పులిని ఒకే నిర్దేశిత మార్గంలోకి వచ్చేలా అటవీ సిబ్బంది డ్రైవ్ చేస్తున్నారు. అడవిలో నాలుగు వైపులా ప్రత్యేకంగా ఎరలు అమర్చి బోన్లను సిద్ధం చేశారు. పులి ఎర వద్దకు రాగానే క్షణాల్లో దాన్ని లొంగదీసుకునేందుకు నలుగురు ప్రత్యేక నిపుణులైన షూటర్లు, వెటర్నరీ వైద్యుల బృందాలు మత్తుమందు తుపాకీలతో సిద్ధంగా ఉన్నాయి.
పరిసర గ్రామాల్లో మైక్ అనౌన్స్మెంట్లు, విజ్ఞప్తి: దర్భగూడెం, చెల్లావారిగూడెం, సీతాంపేట వంటి సమీప గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. కన్నాపూర్, పోలవరం, కుకునూరు, జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు నిరంతరం విధుల్లో ఉన్నారని, ప్రజలు భయాందోళన చెందకుండా అటవీ శాఖకు సహకరించాలని డీఎఫ్ఓ విజ్ఞప్తి చేశారు.




