వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. ప్రభుత్వ పథకాలు వారికి ఆమడ దూరం.. నెలనెలా అందాల్సిన రేషన్ బియ్యం కూడా తెచ్చుకోవాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్తేనే నాలుగు బియ్యం గింజలు వాళ్లకు దొరికేది. కొన్ని సందర్భాల్లో వర్షాలు వచ్చినా మరి ఇతర కారణాలతో వెళ్లకపోతే ఆ బియ్యం కూడా వారికి దక్కవు. ఎట్టకేలకు అధికారులు చొరవతో ఆ గ్రామానికి రేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. గిరిజనులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంతో వాళ్లంతా పట్టలేనంత ఆనందంతో సందడి చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేబు PVTG కొందు గిరిజన గ్రామం. 29 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. నెలనెలా రేషన్ సరుకులు తీసుకోవాలంటే వేలమామిడికి వెళ్ళాలి. అందుకోసం 15 కిలోమీటర్లు నడవాలి. రాను పోను ప్రయాణానికి ఓ రోజంతా వారికి గడిచిపోతుంది. అంత కష్టపడితేనే వాళ్లకు నెలకు అందాల్సిన రేషన్ దక్కుతుంది. లేకపోతే.. ఒక్క గింజ కూడా వాళ్లకు ఆ రేషన్ బియ్యం అందదు. వారి కష్టాలు అధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు స్పందించారు. కలెక్టర్ నిశాంతి చొరవతో వాళ్లకు రేషన్ కష్టాలు తీరాయి. రేషన్ పాయింట్ ఏర్పాటు చేసి బియ్యం పంపిణీ చేయడంతో… ఆ ఆదివాసి కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బియ్యం తీసుకున్న తర్వాత ఆదివాసి గిరిజన మహిళలు దింసా నిత్యంతో తన ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ అడవి బిడ్డలు.
వీడియో చూడండి..