Headlines

‘సివిల్స్‌ ఇంటర్వ్యూ అంటే భయపడ్డా.. కానీ వారు అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగిపోయింది’.. UPSC టాపర్‌ అఖిల్‌ బుద్ధి | I Was Scared of the UPSC Interview, But the Questions Surprised Me Ranker 566 Buddhi Akhil


వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన అఖిల్‌.. పట్టుదల, నిరంతర సాధన, స్వీయ ప్రేరణతో మూడో ప్రయత్నంలో సివిల్స్‌ విజయం సాధించారు. తొలి ప్రయత్నంలో భయం కారణంగానే విఫలమయ్యానని ఆయన తెలిపారు. రెండో ప్రయత్నంలో సీరియస్‌గా పరీక్ష రాసినప్పటికీ అదృష్టం కలిసిరాలేదన్నారు. అయితే ఈసారి అన్ని అంశాలు తనకు అనుకూలంగా కలిసి వచ్చాయని చెప్పారు. తన విజయానికి ప్రధాన కారణాలు కన్సిస్టెన్సీ, సెల్ఫ్‌ మోటివేషన్‌ అని అఖిల్‌ పేర్కొన్నారు. సివిల్స్‌ వంటి పరీక్షలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవడం చాలా ముఖ్యమన్నారు.

వ్యవసాయ కుటుంబం నుంచి సివిల్స్‌ వరకు

ఇంటర్వ్యూకు ముందు బాలలత మేడమ్‌ను కలిశానని అఖిల్‌ తెలిపారు. ఆమె తనకు మానసికంగా ఎంతో మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘నీకు వస్తుంది అఖిల్‌’ అంటూ ఇచ్చిన ప్రోత్సాహం ఇంటర్వ్యూకు ముందు తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. తనకు ఇదే తొలి ఇంటర్వ్యూ కావడంతో భయం ఉన్నప్పటికీ, ఆ ప్రోత్సాహంతో కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూకు వెళ్లినట్లు వివరించారు. ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత వివరాలపైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగారని, ప్రశ్నలు చాలా సింపుల్‌గా ఉన్నాయని చెప్పారు. అఖిల్‌ స్వస్థలం సిద్దిపేట సమీపంలోని కొండపాక గ్రామం. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమని తెలిపారు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి ఉందన్నారు. చిన్నప్పటి నుంచే సివిల్స్‌ లక్ష్యం లేదని, కాలేజీ రోజుల్లో కలెక్టర్‌ కావాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. తమ జిల్లాలో మంచి పనులు చేసిన స్మితా సబర్వాల్‌ తనకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. తండ్రి కల, స్మితా సబర్వాల్‌ చేసిన పనుల నుంచి పొందిన ప్రేరణ రెండూ తనను సివిల్స్‌ వైపు నడిపించాయని అఖిల్‌ వివరించారు.

రోజుకు 8 గంటల చదువు

చిన్న వయసులోనే ఇంత గొప్ప బాధ్యతతో కూడిన సర్వీస్‌ సాధించడం తనకు ఎంతో ముఖ్యమైన సందర్భమని అఖిల్‌ అన్నారు. పరిపాలనలో సమర్థతను పెంచడం, ప్రజలకు దగ్గరగా పనిచేయడం తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై ‘ఆలస్యంగా వస్తారు.. నెమ్మదిగా పనిచేస్తారు’ అనే అపోహ ఉందని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలతో వచ్చినప్పుడు వీలైనంత త్వరగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. సివిల్స్‌ అభ్యర్థులు రోజువారీ చదువులో స్థిరత్వాన్ని కొనసాగించాలని అఖిల్‌ సూచించారు. రోజుకు సుమారు 8 గంటలు చదవడం ముఖ్యమని, అయితే ఏ సమయంలో చదువుతున్నామన్నదానికంటే ప్రతిరోజూ చదవడం ముఖ్యమని చెప్పారు. ప్రిపరేషన్‌ సమయంలో ‘మనకు వస్తుందా? రాదా? ఏమైనా మిస్‌ అవుతున్నామా?’ అనే సందేహాలు సహజంగానే వస్తాయని, వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. సెల్ఫ్‌ డౌట్‌ను పక్కనపెట్టి మోటివేషన్‌తో, కన్సిస్టెన్సీతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధించవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి



ఓటములే మరింత బలాన్నిచ్చాయి

తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌, రెండో ప్రయత్నంలో మెయిన్స్‌లో విఫలమైనప్పుడు తనలోనూ సందేహాలు కలిగాయని అఖిల్‌ తెలిపారు. “నాతో అవుతుందా? నేను ఆ స్థాయికి చేరుకోగలనా?” అనే ఆలోచనలు వచ్చినప్పటికీ సెల్ఫ్‌ మోటివేషన్‌, ఆప్టిమిజం తనను ముందుకు నడిపించాయని చెప్పారు. కాలేజీ పూర్తయిన వెంటనే సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించానని, మధ్యలో ఎలాంటి ఉద్యోగం చేయలేదని అఖిల్‌ తెలిపారు. మూడో ప్రయత్నంలో 566వ ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన విజయంతో నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్ని ఓటములు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చనే సందేశం యువతకు అందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *