సాధారణంగా ఆలయానికి వెళ్లామంటే.. స్వామి దర్శనం.. పూజారి పూజలు.. తీర్థప్రసాదాలు.. ఇలా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఈ ఆలయం.. మిగతా ఆలయాల్లా కాదు.. ఇక్కడ గంట మోగుతుంది, భక్తి వినిపిస్తుంది.. కానీ పూజారి కనిపించరు.. ఎందుకంటే మనసులో భక్తి ఉంటే చాలు.. స్వామిని స్వయంగా దర్శించుకోవచ్చు.. పూజించుకోవచ్చు. ఇక్కడ భక్తుడే పూజారి.. భక్తుడే అర్చకుడు. దేవుడికి దగ్గరవ్వడానికి పెద్ద పెద్ద ఆచారాలు అవసరం లేదని.. భక్తితో కూడిన మనసే ముఖ్యమని ఈ ఆలయం చాటుతోంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన పానుగుళ్ల యాదయ్య-జయమ్మ దంపతుల ఏకైక కుమారుడు వెంకటేశ్వర్లు. వ్యవసాయం జీవనోపాధిగా ఈ దంపతులు తమ కొడుకుని ఉన్నంతలో చదివించారు. వెంకటేశ్వర్లు కూడా స్వయంకృషితో ఐఐటీ గువహటిలో మాస్టర్స్ పూర్తి చేశారు. డీఆర్ డీఓ (పుణె), యూఏఈలోని పలు ఇంటర్నేషనల్ విద్యాసంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ప్రముఖ విద్యాసంస్థలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి వెంకటేశ్వర్లకు భక్తి భావం ఎక్కువ. ప్రత్యేకంగా కృష్ణుడిపై భక్తి భావంతో పూజల్లో పాల్గొనేవాడు. కృష్ణ మందిరాలు ద్వారక, ఉడిపి, పూరీ, మధుర, బృందావన్ లాంటి ఆలయాలను దర్శించారు. భక్తికి వైభవం, ఆర్భాటం కంటే భావం ముఖ్యమనీ భావించాడు. ప్రకృతి ఒడిలో కృష్ణ మందిరాన్ని నిర్మించాలని భావించాడు. గ్రామంలో తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో ఐఐటీ స్నేహితులు, దాతల సహ కారంతో పన్నెండేళ్ల క్రితం ఆర్గానిక్ కృష్ణ మందిరాన్ని నిర్మించారు.
సాంకేతిక విద్యను అభ్యసించిన ఆయన.. ఆధ్యాత్మికతను మాత్రం ప్రకృతితో ముడి పెట్టారు. ఆలయ నిర్మాణంలో ప్రకృతికి ప్రాధాన్యం ప్రాధాన్యం ఇచ్చాడు. చుట్టూ పచ్చని పొలాలు.. ప్రశాంతమైన వాతావరణం.. ఆధ్యాత్మికతను పంచే ఆలయంగా రూపుదిద్దాడు. ఆలయానికి వస్తే దేవుడిని మాత్రమే కాదు.. ప్రకృతిని కూడా ఆస్వాదించేలా వాతావరణాన్ని తీర్చిదిద్దారు. ఈ మందిరంలో నల్లరాయితో చెక్కిన ముగ్ధమనోహరమైన కృష్ణుడి విగ్రహంతో పాటు వినాయకుడు, హనుమంతుడు, శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, నంది, సరస్వతీదేవి, నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం స్వామిని దర్శించుకుని వెళ్లిపోవాల్సిన అవసరం లేదు
స్వామికి.. భక్తుడికి మధ్య ఎవరూ అవసరం లేదని ఆలయ నిర్వాహకులు కొత్త సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మనసులోంచి వచ్చే ప్రార్థనే అసలైన పూజ అని చెబుతూ.. భక్తులే స్వయంగా స్వామిని దర్శించుకోవచ్చు. తమకు నచ్చిన విధంగా పూజలు చేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.ఈ ఆలయానికి వచ్చే భక్తులకు మరో ప్రత్యేక సౌకర్యం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత వసతి, భోజన సౌకర్యాలు అందిస్తున్నారు. అంటే.. డబ్బు ఖర్చు పెట్టి హడావుడిగా దర్శనం చేసుకుని వెళ్లడం కాదు. ప్రశాంతంగా వచ్చి.. స్వామిని దర్శించుకుని.. ప్రకృతి ఒడిలో కొంత సమయం గడిపి.. తిరిగి వెళ్లే అవకాశం ఆలయ నిర్వాహకులు కల్పిస్తున్నారు.ఈ కృష్ణ మందిరంలో ప్రతి నెలా ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు.. హోలీ.. కార్తిక మాసం.. ఫాల్గుణ పౌర్ణమి వంటి సందర్భాల్లోనూ విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో భక్తుల రాకతో ఈ ప్రకృతి ప్రాంగణం మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది
దేవుడికి మనసును అర్పించడమే భక్తి. భక్తి అంటే పూజలు చేయడం, కానుకలు ఇవ్వడం కాదు. దేవుడి ముందు మనసును ఉంచి ప్రశాంత పరుచుకోవడమే భక్తి అని ఆర్గానిక్ కృష్ణ మందిరం వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ఈ ఉద్దేశంతోనే ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రకృతి ఒడిలో ఉండేలా తీర్చిదిద్దామని, శ్రీకృష్ణ భక్తిని పెంపొందించడం, ప్రకృతిని పరిరక్షించడం సనాతన ధర్మ విలువలను భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యమని అంటున్నారు. ఈ సంకల్పంతోనే మందిరాన్ని ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. దేవుడికి దగ్గరవ్వడానికి పెద్ద పెద్ద ఆచారాలు అవసరం లేదని.. భక్తితో కూడిన మనసే ముఖ్యమని ఈ ఆలయం చాటుతోంది. భక్తి, ప్రకృతి, ఆత్మపరిశీలనను ఒకే చోట కలిపిన ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రత్యేకతను సంపాదించుకుంటోంది.




