ఆకలితో ఉన్న ఒక అరుదైన శ్వేతనాగు కోళ్ల గూటిపై దాడి చేసి, ఎదురుగా ఉన్న కోడిని కాటేసి చంపడమే కాకుండా.. ఏకంగా పది గుడ్లను గుటుక్కున మింగేసింది. అయితే ఆ అత్యాశే ఆ పాముకు ప్రాణసంకటంగా మారింది. ఒకేసారి పది గుడ్లను తినడంలో పొట్ట ఉబ్బిపోయి, మొద్దుబారి అసలు కదల్లేని నిస్సహాయ స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. ఈ విచిత్ర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కొక్కు ఆనంద్ అనే వ్యక్తి తన ఇంటి ప్రాంగణంలో నాటుకోళ్లను పెంచుతున్నాడు. ఈ క్రమంలో శ్వేతనాగు ఆహారం కోసం కోళ్ల గూట్లోకి చొరబడింది. లోపల గుడ్లపై పొదుగుతున్న కోడిని చూడగానే ఒక్కసారిగా కాటు వేసి హతమార్చింది.
ఆ తర్వాత ఆ గూటిలో ఉన్న సుమారు 10 కోడిగుడ్లను ఒకదాని వెనుక మరొకటి చొప్పున మింగేసింది. అయితే గూటి నుంచి అసాధారణ శబ్దాలు రావడంతో అనుమానం వచ్చిన ఆనంద్ వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. గూటిలో ఒకవైపు కోడి విగతజీవిగా పడి ఉండగా.. దాని పక్కనే పొట్టంతా గుడ్లతో ఉబ్బిపోయి, బరువెక్కిన శరీరంతో అంగుళం కూడా కదలలేక చచ్చుబడిపోయిన స్థితిలో ఒక తెల్లని నాగుపాము పడి ఉంది. ఆకలి తీరిన తర్వాత అక్కడి నుంచి జారుకుందామనుకున్న పాముకు, ఏకకాలంలో పది గుడ్లు మింగడం వల్ల వచ్చిన శరీర భారంతో అక్కడి నుంచి కదలడం అసాధ్యంగా మారింది.
పామును చూసి భయపడిన ఆనంద్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కిరణ్.. విషపూరితమైన ఆ శ్వేతనాగును చాకచక్యంగా, ఎలాంటి ప్రమాదం జరగకుండా బంధించాడు. అనంతరం ఆ పామును సురక్షితంగా సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. దీంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.