ఇప్పటికే గౌహతి-హౌరా మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ సర్వీసులు పట్టాలెక్కగా.. మరికొన్ని రైళ్లు ప్రస్తుతం ట్రయల్ రన్ పూర్తి చేసుకుంటున్నాయి. వీటిని త్వరలోనే బెంగళూరు-ముంబై వంటి కీలక మార్గాల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రూట్లలో రాత్రి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ భారీ స్థాయిలో కసరత్తు చేస్తోంది.
ఈ స్లీపర్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు భారతీయ రైల్వే ఏకంగా 260 రైళ్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బీఈఎంఎల్ సంస్థ 16 కోచ్లతో కూడిన 10 రైళ్లను తయారు చేస్తుండగా.. చెన్నైలోని ఐసీఎఫ్ 24 కోచ్లతో 50 రైళ్లను నిర్మిస్తోంది. వీటికి అదనంగా కినెట్ సంస్థ 120 రైళ్లను, టిటాగఢ్-భెల్ కన్సార్టియం 80 రైళ్లను తయారు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సాంకేతికంగా ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల డిజైన్ వేగంతో ట్రాక్ల సామర్థ్యాన్ని బట్టి గంటకు 160 కిలోమీటర్ల కార్యాచరణ వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యేక ఇంజిన్ కాకుండా బోగీల కిందే పవర్ యూనిట్లు ఉండే డిస్ట్రిబ్యూటెడ్ పవర్ విధానం వల్ల రైలు వేగాన్ని పుంజుకోవడం, బ్రేకులు వేయడం సులువై ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. యూరోపియన్ శైలి డిజైన్లతో రూపొందుతున్న 16 కోచ్ల ప్రొటోటైప్లో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ మరియు ఒక ఫస్ట్ ఏసీ కోచ్లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల సౌకర్యాల విషయానికొస్తే.. విమానాల తరహాలో బయో వాక్యూమ్ టాయిలెట్లు, దివ్యాంగులకు ప్రత్యేక వాష్రూమ్లు అమర్చారు. ఫస్ట్ ఏసీ కోచ్లో వేడినీళ్లతో కూడిన షవర్ సౌకర్యం లభించనుంది. కోచ్లలో మెరుగైన కుషన్ బెర్తులు, రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీలు, ప్యాంట్రీ కార్లు మరియు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు ప్రయాణాన్ని విలాసవంతంగా మారుస్తాయి.
భద్రతకు పెద్దపీట వేస్తూ స్వదేశీ సాంకేతికత కవచ్ రక్షణ వ్యవస్థను ఈ రైళ్లలో అనుసంధానించారు. అత్యవసర సమయాల్లో లోకోపైలట్తో నేరుగా మాట్లాడే సదుపాయం, స్టేషన్లలో మాత్రమే తెరుచుకునే ఆటోమేటిక్ డోర్లు, శక్తిని ఆదా చేసే రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్, తయారీ పనులు పూర్తయ్యాక దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.




