Headlines

డిజిటల్ ఎంట్రీతో మోదీ సభ.. బుక్‌మైషోలో తొలిసారిగా బుకింగ్‌లు, స్లాట్‌లు.. గంటలోనే హౌజ్‌ఫుల్! | PM Modi Gujarat Visit: BookMyShow Digital QR Entry, Rs 35,000 Cr Infra Boost for Vadodara


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 8వ తేదీన గుజరాత్‌లోని వడోదరలో పాల్గొననున్న కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. తొలిసారిగా ఇలాంటి ప్రధానమంత్రి కార్యక్రమానికి BookMyShow ద్వారా ఉచిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టగా.. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన గంటలోపే అందుబాటులో ఉన్న సీట్లన్నీ బుక్ అయ్యాయి. ఆ తర్వాత కూడా భారీ సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించడంతో 42,000 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో చేరారు.

QR కోడ్‌తో డిజిటల్ ఎంట్రీ

వడోదరలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రవేశ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వారి BookMyShow ఖాతాలో డిజిటల్ M-Ticket అందుతుంది. అందులో సురక్షితమైన QR కోడ్ ఉంటుంది. వేదిక వద్ద ప్రవేశ సమయంలో ఈ QR కోడ్‌ను స్కాన్ చేసి హాజరును ధృవీకరిస్తారు. రిజిస్ట్రేషన్ నుంచి వెరిఫికేషన్, ఎంట్రీ, సీటింగ్ వరకు మొత్తం వ్యవస్థను డిజిటల్‌గా నిర్వహించడం ద్వారా భారీ జనసందోహం ఉన్నప్పటికీ క్యూలు, రద్దీని తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ పావిలియన్ గ్రౌండ్‌లో జరగనుంది. BookMyShowలో కార్యక్రమ సమయాన్ని ఉదయం 10:30గా పేర్కొన్నారు.

రూ.35 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు

ప్రధాని మోదీ సెప్టెంబర్ 8న గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటించనున్నారు. వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (WDFC). మొత్తం 326 రూట్ కిలోమీటర్ల పొడవైన మూడు కీలక విభాగాలను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. వీటి అభివృద్ధికి రూ.20,700 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

మూడు WDFC సెక్షన్లు

ప్రధాని మోదీ 329 కిలోమీటర్ల మేర విస్తరించి, రూ. 9,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న మూడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో వడోదర-రత్లాం మూడవ, నాలుగవ లైన్లు, మియాగం కర్జాన్-చోరండా-మల్సార్ గేజ్ మార్పిడి, మరియు విశ్వమిత్రి-దభోయ్ డబ్లింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రయాణీకుల, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచి, ట్రాఫిక్ రద్దీని తగ్గించి, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయి. దీంతో పరిశ్రమల కేంద్రాలు, పోర్టుల మధ్య సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది. ముఖ్యంగా Jawaharlal Nehru Port Authority (JNPA)తో నేరుగా అనుసంధానం ఏర్పడటంతో ఎగుమతి, దిగుమతి సరుకు రవాణాకు ప్రయోజనం కలుగుతుంది. రవాణా సమయం, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడంతో పాటు ముంబై రైల్వే నెట్‌వర్క్‌పై ఉన్న రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది.

రహదారులపై కూడా భారీ పెట్టుబడులు

రైల్వే ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.1,780 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో NH-48లో కామ్రేజ్–చల్తాన్ సెక్షన్‌ను ఆరు లేన్లుగా విస్తరించడం, వడోదర–సూరత్ మార్గంలో తాపీ, నర్మదా నదులపై అదనపు వంతెనలు సహా ఇతర నిర్మాణాలు, అలాగే NH-53లో అబావా, మింధోలా, ఖజోడ్ జంక్షన్ల వద్ద గ్రేడ్-సెపరేటెడ్ నిర్మాణాలు ఉన్నాయి. కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్రైట్ కారిడార్ సెక్షన్ల నుంచి ప్రధాని.. న్యూ సానంద్ (ఉత్తర), న్యూ మకర్‌పుర, న్యూ ఉంబర్‌గావ్, న్యూ జెఎన్‌పిటి ప్రాంతాల నుంచి సరుకు రైళ్ల సేవలను కూడా ప్రారంభించనున్నారు. అలాగే వడోదర–టాండా రోడ్ మధ్య కొత్త రైలు సేవకు కూడా పచ్చజెండా ఊపనున్నారు.

మహారాష్ట్రలో Global Fintech Fest

వడోదర కార్యక్రమం అనంతరం ప్రధాని మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం సుమారు 5:45 గంటలకు Global Fintech Fest 2026ను ప్రారంభించి ప్రసంగించనున్నారు. మొత్తంగా, మోదీ వడోదర పర్యటనలో ఒకవైపు భారీ స్థాయి రైల్వే, ఫ్రైట్ కారిడార్, హైవే ప్రాజెక్టులు ప్రారంభం కానుండగా.. మరోవైపు కార్యక్రమానికి ప్రజల ప్రవేశాన్ని కూడా డిజిటల్ టెక్నాలజీతో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. గంటలోపే సీట్లు పూర్తవడం, 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో చేరడం కార్యక్రమంపై ఉన్న భారీ ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *