మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో రిక్షావోడు చిత్రం ఒక ముఖ్యమైన మలుపు. చిరంజీవి తొలిచిత్రం ప్రాణం ఖరీదు నిర్మాత క్రాంతి కుమార్, మెగాస్టార్ శిఖరాగ్రానికి ఎదిగిన తర్వాత నిర్మించిన చిత్రమిది. దర్శకుడు కోడి రామకృష్ణతో కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. 1995 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. ఆయన తొలిసారిగా రిక్షా కార్మికుని పాత్ర పోషించడంతో మెగా అభిమానులు ఎంతో ఉత్సాహపడ్డారు. నగ్మా, సౌందర్య తమ గ్లామర్తో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు. అన్ని సక్రమంగా కుదిరి, విజయం ఖాయమనే నమ్మకంతో విడుదలైన రిక్షావోడు చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అంచనాలు తలకిందులై, ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది.
తండ్రీ కొడుకుల పాత్రల్లో చిరంజీవి అభినయం అత్యద్భుతంగా ఉన్నప్పటికీ, కథనం, మిగిలిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ పరాజయం చిరంజీవిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఏ సినిమా చేయాలో తెలియని అంతర్మధనంలో పడి, ఆయన దాదాపు ఎనిమిది నెలల పాటు మేకప్కు దూరంగా ఉండిపోయారు. రిక్షావోడు చిరంజీవి కెరీర్లో ఒక గుణపాఠంగా మిగిలిపోయింది, ఇది భవిష్యత్ చిత్రాల ఎంపికలో ఆయనకు మరింత జాగ్రత్తను నేర్పింది. కాగా అదే సమయంలో రిలీజైన ఆర్ నారాయణమూర్తి ఒరేయ్ రిక్షా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.