హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీ దగ్గర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును అరెస్టు చేసేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. తాతా మధు ఇంట్లో నుంచి బయటకు రావాలని కోరారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
సోమవారం అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై పోలీసులు వరుస కేసులు నమోదు చేశారు. పోలీసుల విధుల ఆటంకం కలిగించడం, స్పీకర్ను దూషించడంపై బీఆర్ఎస్ నేతలపై పలు కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన నివాసం వద్ద తాతా మధును అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్న నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.అనంతరం నాంపల్లి కోర్టులో తాతా మధును హాజరుపర్చనున్నారు పోలీసులు. తాతా మధుతో పాటు నవీన్కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం.
అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలింగించారని మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్రావు, సుధీర్రెడ్డిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.
పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారని.. పోలీసులతో వాగ్వాదానికి దిగారని.. వీడియో ఫుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు, ఇప్పటివరకు మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. మరికొందరి పాత్రపై వీడియో ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.