Headlines

IND vs PAK : రోహిత్, కోహ్లీ లేకుండానే పాక్‌తో బిగ్ ఫైట్.. ఎప్పుడు, ఎక్కడంటే? | IND vs PAK India Pakistan Could Clash In Asian Games 2026 Final

IND vs PAK : రోహిత్, కోహ్లీ లేకుండానే పాక్‌తో బిగ్ ఫైట్.. ఎప్పుడు, ఎక్కడంటే? | IND vs PAK India Pakistan Could Clash In Asian Games 2026 Final


IND vs PAK : ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో, కేవలం మల్టీ నేషన్ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు ఎదురెదురుపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. 2026 ప్రారంభంలో టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడిన ఈ సాంప్రదాయ ప్రత్యర్థులు, ఈ ఏడాది మిగిలిన కాలంలో మళ్లీ తలపడే అవకాశం ఉందని సమాచారం. ఆసియా క్రీడలు 2026లో భారత్, పాక్ మ్యాచ్ జరిగేందుకు బాటలు సుగమమయ్యాయి.

రోహిత్, కోహ్లీలు ఎందుకు ఆడటం లేదంటే?

ఆసియా క్రీడల్లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ, టీమిండియా అభిమానులకు ఒక చిన్న నిరాశ ఎదురుకాక తప్పదు. ఈ మ్యాచ్‌లలో భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కనిపించరు. దీనికి కారణం ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2024 టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే వీరు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు.

డైరెక్ట్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్, పాకిస్థాన్

ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్‌కు సంబంధించిన పురుషుల, మహిళల జట్ల షెడ్యూల్‌ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పురుషుల విభాగంలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా నాకౌట్ (క్వార్టర్ ఫైనల్స్) రౌండ్‌కు అర్హత సాధించాయి. ఇతర జట్లు క్వాలిఫైయర్ రౌండ్ల ద్వారా క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరుకుంటాయి. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు ఈ పతక పోరులో పోటీపడనున్నాయి.

భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎలా జరుగుతుంది?

టోర్నీ డ్రా ప్రకారం భారత్, పాకిస్థాన్ జట్లు క్వార్టర్ ఫైనల్స్ లోనే ఎదురెదురు పడే అవకాశం లేదు. భారత్, బంగ్లాదేశ్ జట్లు ఒకే హాఫ్‌లో ఉండగా.. పాకిస్థాన్, శ్రీలంక జట్లు మరో హాఫ్‌లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లు తమ తమ క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లలో గెలిస్తేనే ముఖాముఖి తలపడతాయి. అంటే కేవలం గోల్డ్ మెడల్ మ్యాచ్‌లోనే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర పోరు చూసే అవకాశం ఉంటుంది. ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు, పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *