Headlines

Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలు ఇవే.. | Independence Day vs Republic Day: Know the Key Differences Between August 15 and January 26

Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలు ఇవే.. | Independence Day vs Republic Day: Know the Key Differences Between August 15 and January 26


ప్రతీ ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దీనిని జరుపుకుంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజున ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ రోజున వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పంచుకుంటారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటారు. దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ రోజును జరుపుకుంటారు.

గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి..?

అలాగే జనవరి 26న ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఇదే విధంగా జాతీయ జెండాలు ఎగురవేసి సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటనే విషయంలో చాలామంది పొరపడుతుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం అంటే ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి లభించిన రోజు. ఇక గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో దేశం గణతంత్ర రాజ్యంగా మారింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. అనంతరం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో జనవరి 26న ప్రతీ ఏడాది జాతీయ జెండాను ఎగురవేసి పండుగలా జరుపుకుంటాం.

రెండింటి మధ్య తేడా ఏంటంటే..?

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో నిర్వహించే వార్షిక పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ఈ పరేడ్ ప్రారంభమై.. ఇండియా గేట్ వద్ద వరకు జరుగుతుంది. రాష్ట్రపతి కర్తవ్య పథ్ వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ వేడుకలలో భారత సైన్యం, భారత నావికాదళం, భారత వైమానిక దళం నిర్వహించే పరేడ్‌లు, వైమానిక ప్రదర్శనలతో పాటు భారతదేశ సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఇక ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా జాతీయ జెండాలు ఆవిష్కరించడం, పరేడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం బ్రిటీష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిన సందర్భంగా జరుపుకుంటే.. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా నిర్వహించుకుంటారు. ఈ రెండు రోజులు భారతీయులకు ముఖ్యమైన పండుగలుగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *