గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ పింఛన్ వ్యవస్థ కింద ఒక కొత్త పింఛన్ స్కీమ్ తీసుకొచ్చింది. పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి అథారిటీ ఈ పథకాన్ని ప్రారంభించింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఓలా, ఉబర్ వంటి ఫ్లాట్ఫామ్స్లో పనిచేసేవారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు కొంత చందా కట్టాల్సి ఉంటుంది. స్వల్ప మొత్తంలో ఈ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కేవలం రూ.99 నుంచి అమౌంట్ ప్రారంభమవుతుంది. చిన్న పెట్టుబడితో భవిష్యత్తులో ఆర్ధిక భరోసా పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
కేవలం రూ.99తో ప్రారంభం
కేవలం రూ.99తో పింఛన్ పథకంలో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి ఎలాంటిది లేదు. గిగ్ వర్కర్లు ఎప్పుడైనా ఈ పథకంలో చేరేలా నిబంధనలు రూపొందించారు. ముందుగా రూ.99 చెల్లించి ఈ స్కీములో చేరినా.. ఆ తర్వాత ఎప్పుడైనా పెంచుకోవచ్చు. మీకు నచ్చినంత పెట్టుబడి పెట్టుకునే అవకాశంలో ఈ పథకంలో ఉంది. ఇక పదవీ విరమణ వయోపరిమితి కూడా విధించలేదు. గిగ్ వర్కర్లు ఎప్పటివరకు అయినా ఈ పథకంలో చందా చెల్లించవచ్చు. దీని ద్వారా జీవితాంతం పెన్షన్ సౌకర్యం పొందవచ్చు. డిజిటల్ ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్లో పనిచేసే వర్కర్లు, ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ లాంటి ఫుడ్, గ్రోసరీ సంస్థల్లో పనిచసేవారితో పాటు ఓలా, ఉబెర్, ర్యాపిడో లాంటి రైడ్ హెయిలింగ్ డ్రైవర్లు, అర్బన్ కంపెనీ లాంటి గృహ సేవలు అందించేవారు కూడా ఈ పథకంలో చేరవచ్చు.
అకౌంట్ తెరవడం ఎలా..?
గిగ్ వర్కర్స్ పింఛను పథకం ఆప్షన్ ఎంచుకుని ఎన్పీఎస్ అకౌంట్ తెరవాలి. పేరు, ఆధార్ అడ్రస్, పాన్, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు నమోదు చేసి కేవైసీ వివరాలు అందించాలి. అనంతరం కార్మికుని సమ్మతితో శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) జారీ చేస్తారు. ఆన్బోర్డింగ్ జరిగిన 60 రోజుల్లోపు తల్లిదండ్రుల సమాచారం, నామినీ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఒకసారి ఖాతా తెరిచిన తర్వాత కంపెనీ మారినా అలాగే ఉంటుంది. కొత్త అగ్రిగేటర్తో ఈ అకౌంట్ను సులభంగా అనుసంధానించుకోవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కార్మికులు ఒకేసారి మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లు, స్టాక్ మార్కెట్లలో మీ నిధిని పెట్టుబడి పెడతారు. దీంతో దీర్ఘకాలంతో పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.