Headlines

IRCTC: భక్తులకు గుడ్‌న్యూస్.. అరుణాచలం, కాంచీపురం, పుదుచ్చేరికి 5 రోజుల టూర్.. ధర ఎంతో తెలుసా? | Arunachala Moksha Yatra: 5 Day Tour Package to Puducherry, Arunachalam and Kanchipuram from Rs 11,820


IRCTC Arunachala Moksha Yatra Package Telugu: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణంతో కూడిన ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది.

ప్యాకేజీ వివరాలు

ఈ టూర్ ప్యాకేజీ కోడ్ SHR107. ప్రతి శుక్రవారం ఈ యాత్ర ప్రారంభమవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు రైలు బయలుదేరుతుంది. ప్యాకేజీలో స్లీపర్ క్లాస్, 3AC ప్రయాణ సదుపాయాలను అందిస్తున్నారు. టూర్‌లో భాగంగా రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు అందిస్తారు.

రోజు వారీగా టూర్ షెడ్యూల్

  1. మొదటి రోజు – శుక్రవారం: సాయంత్రం 5 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 17653 కాచిగూడ–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
  2. రెండవ రోజు – శనివారం: ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి చేరుకున్న తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. అనంతరం అరవిందో ఆశ్రమం, ఆరొవిల్, ప్యారడైజ్ బీచ్ సందర్శిస్తారు. రాత్రి పుదుచ్చేరిలో బస ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి



  4. మూడవ రోజు – ఆదివారం: హోటల్‌లో అల్పాహారం తర్వాత పుదుచ్చేరి నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని తిరువణ్ణామలైకి బయలుదేరుతారు. హోటల్‌లో చెక్‌ఇన్ అనంతరం భక్తులు అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రి తిరువణ్ణామలైలో బస ఉంటుంది.
  5. నాల్గవ రోజు – సోమవారం: అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి కాంచీపురానికి బయలుదేరుతారు. అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం దర్శిస్తారు. అనంతరం అరక్కోణం రైల్వే స్టేషన్‌కు చేరుకుని సాయంత్రం 6:05 గంటలకు 17651 రైలులో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
  6. ఐదవ రోజు – మంగళవారం: ఉదయం 7:50 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు

జూన్ 1, 2026 నుంచి అమల్లో ఉన్న ధరల ప్రకారం 1 నుంచి 3 మంది ప్రయాణికులకు 3AC కంఫర్ట్ ప్యాకేజీలో ట్విన్ షేరింగ్‌కు రూ.16,900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,210గా ఉంది. స్లీపర్ క్లాస్ స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు వరుసగా రూ.14,820, రూ.11,125.

4 నుంచి 6 మంది ప్రయాణికులకు 3AC కంఫర్ట్ ట్విన్ షేరింగ్ రూ.13,900, ట్రిపుల్ షేరింగ్ రూ.11,920 కాగా, స్లీపర్ క్లాస్ స్టాండర్డ్ ట్విన్ షేరింగ్ రూ.11,820, ట్రిపుల్ షేరింగ్ రూ.9,840గా ఉంది. పిల్లలకు కూడా ప్రత్యేక ఛార్జీలు ఉన్నాయి.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, అల్పాహారం, ఏసీ వాహనం ద్వారా స్థానిక రవాణా, సందర్శన ప్రాంతాల ట్రిప్, టోల్, పార్కింగ్, జీఎస్‌టీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే మధ్యాహ్నం, రాత్రి భోజనం, రైలులో ఆహారం, ఎంట్రీ టికెట్లు, బోటింగ్ వంటి అదనపు కార్యకలాపాల ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.

పుదుచ్చేరిలో Poppy’s Olive De Villa లేదా సమానమైన హోటల్, తిరువణ్ణామలైలో Leaf Hotel లేదా సమానమైన హోటల్‌లో బస కల్పిస్తారు. హోటల్ చెక్‌ఇన్ సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. రైలు టికెట్లు ప్రయాణ తేదీకి నాలుగు రోజుల ముందు జారీ చేస్తారు. సీట్ల కేటాయింపు కేంద్రీకృత PRS ద్వారా జరుగుతుంది కాబట్టి బెర్త్ మార్పులు లేదా ప్రత్యేక బెర్త్ అభ్యర్థనలు స్వీకరించబడవు.

ఐఆర్‌సీటీసీ అరుణాచలం మోక్ష యాత్ర ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *