Headlines

MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK

MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK


MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాల్లో 2011 వన్డే ప్రపంచకప్ విజయం ఒకటి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి బంతికి కొట్టిన ఆ చారిత్రాత్మక సిక్సర్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. నాటి ఫైనల్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర వేసిన బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచి భారతదేశానికి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను అందించారు. ఆ బంతిని వేసిన లంక పేసర్ కులశేఖర తాజాగా ఆనాటి జ్ఞాపకాలను, ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పగ నుంచి అభిమానం వరకు..

ఆ చారిత్రాత్మక ఫైనల్ తర్వాత తన బౌలింగ్‌లోనే ధోనీ సిక్స్ కొట్టి టైటిల్ గెలుచుకోవడంతో తన మనసులో ధోనీపై కొంత కోపం, కసి ఏర్పడ్డాయని కులశేఖర తెలిపారు. అయితే ఆ తర్వాత పరిణామాలు తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేశాయని చెప్పారు. ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీకి ధోనీ కెప్టెన్సీలోనే ఆడే అవకాశం కులశేఖరకు లభించింది. సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ధోనీ ఎలా ప్రవర్తిస్తాడోనని ఆయన కొంత ఆందోళన చెందారట.

ధోనీ గొప్పతనం అదే..

సీఎస్కే జట్టులో చేరిన తర్వాత ధోనీ ప్రవర్తన చూసి కులశేఖర ఆశ్చర్యపోయారు. ప్రపంచకప్ ఫైనల్లో తాను కొట్టిన ఆ సిక్సర్ గురించి కానీ, ఆ మ్యాచ్ గురించి కానీ ధోనీ ఎప్పుడూ తన దగ్గర ప్రస్తావించలేదని కులశేఖర తెలిపారు. ఎదుటి ఆటగాడిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, గతాన్ని గుచ్చి గుచ్చి చూడకుండా ముందుకు సాగడమే ధోనీ నైజమని కొనియాడారు. “ఆ మ్యాచ్ తర్వాత నేను సీఎస్కేలో చేరినప్పుడు, ధోనీ ఆ ఫైనల్ మ్యాచ్ గురించి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. నన్ను ఎంతో గౌరవించాడు, జట్టులో ఎంతో ప్రోత్సహించాడు. రాబోయే మ్యాచ్‌లను ఎలా గెలవాలనే దానిపైనే దృష్టి పెట్టేవాడు తప్ప, ఇతరులను కించపరిచే గుణం ఆయనకి లేదు” అని కులశేఖర వెల్లడించారు.

ధోనీ లాంటి కెప్టెన్ దొరకడం టీమిండియా అదృష్టం

ధోనీ చూపిన ఆప్యాయత, గొప్ప వ్యక్తిత్వం వల్ల తన మనసులో ఉన్న పగ కాస్తా తీవ్రమైన అభిమానంగా మారిపోయిందని కులశేఖర చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుండి నడిపించే ధోనీ వంటి గొప్ప నాయకుడు లభించడం భారత క్రికెట్ జట్టు చేసుకున్న అదృష్టమని ఆయన కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సాధించినప్పటికీ, ధోనీ మైదానంలో, మైదానం వెలుపల చూపించే వినయం ఆయనను క్రికెట్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిందని లంక మాజీ పేసర్ స్పష్టం చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *