Headlines

Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..! | Vvs laxman gautam gambhir india coach debate zimbabwe series win

Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..! | Vvs laxman gautam gambhir india coach debate zimbabwe series win


VVS Laxman vs Gautam Gambhir: భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ అవసరమా? గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పగ్గాలు అప్పగించాలా? జింబాబ్వేపై 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ చర్చ తీవ్రమైంది. ఇంగ్లండ్‌లో ఘోర పరాజయాల తర్వాత, యువ జట్టును లక్ష్మణ్ విజయపథంలో నడిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

ఇంగ్లండ్ పర్యటనలో నిరాశ.. జింబాబ్వేలో రికార్డు విజయం..

ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 4-0 తేడాతో వైట్‌వాష్ కావడంతో పాటు వన్డే సిరీస్‌ను సైతం కోల్పోయింది. ఐర్లాండ్‌పై కూడా ఓటమి పాలుకావడంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ పీడకల లాంటి ఇంగ్లండ్ టూర్ తర్వాత, గంభీర్ సహా సీనియర్ సహాయక సిబ్బందికి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు స్టాండ్-ఇన్ కోచ్‌గా వెళ్లిన వీవీఎస్ లక్ష్మణ్.. యువకులతో నిండిన జట్టును అద్భుతంగా నడిపించాడు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు ఏకంగా 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి పాత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకున్నారు.

ఇది కూడా చదవండి: చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

నెట్టింట వైరల్‌గా మారిన డ్రెస్సింగ్ రూమ్ వీడియో..

జింబాబ్వేపై అద్భుత విజయానంతరం బీసీసీఐ ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో సిరీస్ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఒకరినొకరు ప్రశంసించుకోవడం కనిపించింది. ఆపత్కాలంలో జట్టును అద్భుతంగా నడిపించిన లక్ష్మణ్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన తీరును నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ఇంగ్లండ్ టూర్‌లోని నెగిటివ్ వాతావరణం నుంచి కుర్రాళ్లను బయటకు తీసుకువచ్చి, వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన విధానం అద్భుతమని కితాబిస్తున్నారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారడంతో, సోషల్ మీడియాలో గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ అనే సరికొత్త చర్చకు తెరలేచింది.

గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌ను తీసుకురావాలన్న ఫ్యాన్స్..

జింబాబ్వే సిరీస్ విజయం తర్వాత అభిమానులు గంభీర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను వెంటనే నియమించాలంటూ బీసీసీఐకి సూచిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంతో ఆటగాళ్లను ప్రోత్సహించడం లక్ష్మణ్ శైలి అని, గంభీర్ తీవ్రమైన స్వభావం జట్టుకు నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, పోస్టులతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. జాతీయ జట్టుకు గంభీర్ కంటే లక్ష్మణే సరైనోడంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ ఆసియా క్రీడల్లో యువ జట్టుకు స్వర్ణ పతకం సాధించి పెట్టిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉందన్న విషయాన్ని పదే పదే గుర్తుచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన వీవీఎస్..

ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ చర్చపై, ప్రశంసలపై వీవీఎస్ లక్ష్మణ్ స్వయంగా స్పందించాడు. ఇదంతా కేవలం ఒక తాత్కాలిక బాధ్యత మాత్రమేనని ఆయన స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ లాంటి సుదీర్ఘ పర్యటన తర్వాత గంభీర్ బృందానికి విశ్రాంతి అవసరం కాబట్టే తాను ఈ సిరీస్‌కు కోచ్‌గా వచ్చానంటూ అసలు విషయం వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) హెడ్‌గా ఉన్న తాను, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా జాతీయ జట్టుకు సేవలు అందిస్తానని గుర్తుచేశాడు. గంభీరే జట్టు పూర్తిస్థాయి కోచ్ అని, శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు తిరిగి ఆయన బాధ్యతలు చేపడతారని లక్ష్మణ్ వివరించాడు. రాబోయే 2026 ఆసియా క్రీడలకు సైతం మళ్లీ తానే కుర్రాళ్ల జట్టును నడిపించనున్నట్లు పరోక్షంగా సూచించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *