ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకూడదు.. అందులోనూ కోతులు పట్టిస్తా అన్న మాట అస్సలు తప్పకూడదు.. గత డిసెంబర్ నెలలో ప్రతి సర్పంచ్ అభ్యర్థికి ఎదురైన డిమాండ్ ఇది. దానికి అంగీకరించి ప్రజల ఓట్లతో సర్పంచ్ అయిన అభ్యర్థులు ఒక్కొక్కరిగా తమ మాటలను నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ సర్పంచ్ సైతం ఓట్లు అడిగేటప్పుడు ఇచ్చిన హామీని గెలిచిన కొద్ది రోజుల్లోనే నెరవేర్చి ఊరందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనే ముదిగొండ గ్రామ సర్పంచ్ ఉపేందర్.
సర్పంచ్ ఎన్నికల ముందు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామంలో ఏ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతోనే నిండి ఉండేది. కార్యాలయాల్లో ఫైళ్లు చింపేయడం, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడం రోజూ పరిపాటి. దీంతో రైతులు, గ్రామస్థులు నానా ఇబ్బందులు పడ్డారు. కోతులు పట్టించాలని పలుమార్లు ర్యాలీలు కూడా చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ లోపల స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతోఇదే అదునుగా సీపీఎం పార్టీ నుండి సర్పంచ్ గా పోటీ చేసిన ఉపేందర్ నన్ను గెలిపించండి.. మన ఊర్లో కోతులు లేకుండా చేస్తా అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మిన గ్రామస్థులు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించారు.
గెలిచిన కొద్ది రోజులకే మాట నిలబెట్టుకున్నారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఊర్లో తిరుగుతున్న కోతులను పట్టించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న పలు కోతులను బంధించి అటవీశాఖకు అప్పగించారు. దీంతో రైతులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది గెలిచిన వెంటనే ఎన్నికల ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తారు.. కానీ ఉపేందర్ మాత్రం గెలిచిన తర్వాత కోతులు పట్టించడమే మొదటి పనిగా పెట్టుకున్నారు. సర్పంచ్ కృషితో గ్రామంలో కోతులు బాధ తప్పిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు. ముందు వాళ్ల సమస్య తీర్చడం నా బాధ్యత అంటున్నారు సర్పంచ్ ఉపేందర్.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.