తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. జొన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.01 లక్షల మంది అకౌంట్లకు వీటిని నేరుగా బదిలీ చేసింది. వీరికి దాదాపు రూ.994 కోట్లు అందించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జొన్నలు విక్రయించిన రైతులకు డబ్బులను విడుదల చేసింది. మద్దతు ధరకే రైతుల నుంచి ప్రభుత్వం జొన్నలు సేరిస్తోంది. రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని తెలిపిన ప్రభుత్వం.. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో జొన్న కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే జొన్న రైతులకు అకౌంట్లో డబ్బులు పడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆధార్తో ఎరువుల కొనుగోలు ప్రక్రియ..
ఎరువుల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెర్టిలైజర్ ఫీల్డ్ స్టాఫ్ (ఎఫ్ఎఫ్ఎస్) వ్యవస్థను మరో 10 జిల్లాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను నేటి నుంచి మరో 10 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఆధార్తో ఎరువులు కొనుగోలు చేస్తున్నామని, దీని వల్ల బ్లాక్ మార్కెటింగ్కు నిరోధించవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఎరువుల స్టాక్ ఎంత ఉందనేది రియల్ టైమ్లో సమాచారం తెలుసుకోవచ్చు. ఇవాళ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ ఫామ్ మొక్కలు వెంటనే రైతులకు అందించాలని ఆదేశించారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. ఇక డ్రిప్ ఏర్పాటుపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. యువ ఆవిష్కర్తలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
ఆయిల్ ఫామ్పై అవగాహన
ఆయిల్ ఫామ్పై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించనుంది. దీని ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను తుమ్మల కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని వేగవంతంగా, పారదర్శకంగా చేపడుతున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ సేవలను విస్తరించినట్లు తెలిపారు.