Headlines

Telangana: హైస్పీడ్‌లో హైదరాబాద్ వైపు దూసుకొస్తున్న కారు.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. | Telangana Eagle Force Busts Odisha to Hyderabad Ganja Network, Two Arrested


ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ముఠా ఆటను తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ (STF), RNCC ఖమ్మం, చౌటుప్పల్ పోలీసులు కలిసి భగ్నం చేశారు. దాదాపు 18 గంటల పాటు రెండు రాష్ట్రాల్లో సాగిన పోలీసుల నిఘా, ఛేజింగ్‌ అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారును అడ్డుకుని 20.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.10.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన త్రిలోచన్ సామంత్ర (30), సాగర్ బాల్ (23)ను అరెస్ట్ చేశారు.

ఆగస్టు 26 రాత్రి ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ నిఘా ప్రారంభించింది. OD02DS 0897 నంబర్‌ గల కారును పోలీసులు ట్రాక్ చేస్తుండగా.. అది విశాఖపట్నంలోని సబ్బవరం వద్ద ఏడు గంటలకుపైగా ఆగి.. ఆగస్టు 27 ఉదయం 7.30 గంటలకు మళ్లీ హైదరాబాద్ వైపు బయలుదేరింది. రాజమండ్రి దాటిన తర్వాత ఖమ్మం–సూర్యాపేట మార్గంలోకి వచ్చిన కారును RNCC ఖమ్మం బృందం రెండు గంటలకుపైగా నిశితంగా గమనించింది. అయితే కారు అతివేగంగా వెళ్తుండటంతో.. హైవేపై వెంటనే ఆపితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. STFకు సమాచారం అందించి, చౌటుప్పల్ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకున్నారు. చివరకు పంతంగి టోల్‌ప్లాజా దాటిన తర్వాత కారు వేగం తగ్గడంతో పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశాకు చెందిన గంజాయి పెడ్లర్ అమిత్ సాహానీ వద్ద సుమారు 20 కిలోల గంజాయిని రూ.25 వేలకే కొనుగోలు చేసినట్లు తేల్చారు. హైదరాబాద్‌కు చెందిన బికాశ్ బారిక్ ఆదేశాలతో దాన్ని నగరానికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ త్రిలోచన్.. బారిక్‌కు గంజాయి సరఫరా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అమిత్ సాహానీ, బికాశ్ బారిక్ పరారీలో ఉండగా.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బికాశ్ బారిక్‌ను 2026 జూన్‌లో గచ్చిబౌలి పోలీసులు ఓ NDPS కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు త్రిలోచన్‌పై ఒడిశాలో దొంగతనం, దోపిడీ, ఆయుధాల చట్టం కింద ఏడు కంటే ఎక్కువ కేసులు ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది.

నిందితుల నుంచి గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. ఈ అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 1908, వాట్సాప్ 87126 71111కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, విశ్వసనీయ సమాచారానికి తగిన రివార్డు అందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *