Headlines

Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్.. | From Dubbing Artist to Music Maestro The Legacy of Chakravarthy


తెలుగు చలన చిత్ర సంగీత సామ్రాజ్యానికి పేరుకు తగ్గట్టుగానే చక్రవర్తిలానే ఓ వెలుగు వెలిగారు సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు శాసించారు. అగ్ర హీరోల దగ్గర నుంచి వర్ధమాన నటీనటుల వరకు అందరికీ చక్రవర్తి సంగీతమే ఊపిరిగా ఉండేది. ఆయన పాలనలో పాటలు ఊగాయి, పరుగులెత్తాయి, ఉరకలు వేశాయి. దాదాపు 960 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తన బాణీలతో దశాబ్దం పైగా ఆంధ్ర దేశాన్ని అలరించారు చక్రవర్తి. పాట వినగానే ఇది చక్రవర్తి స్వరపరిచారు అని సామాన్య ప్రేక్షకుడు కూడా ఇట్టే గుర్తుపట్టేవారు. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. నటుడు, దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు సోదరుడు ఈ చక్రవర్తి. మొదట గాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, మాంగళ్య యోగం కన్నడ చిత్రంలో తొలి పాట పాడారు. ఆ తర్వాత విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన జయ విజయ చిత్రంలో రెండు పాటలు పాడారు. గాయకుడిగా కొనసాగడం ఇష్టం లేక, దర్శకుడు సి.ఎస్.రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, కమలహాసన్, రజనీకాంత్ వంటి అగ్ర నటులకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు.

సమతా మూవీస్ అధినేత ఛటర్జీ అప్పారావు పేరును చక్రవర్తిగా మార్చి, 1971లో “మూగ ప్రేమ” సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ చిత్రం హిట్ కాకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగారు. నిర్మాత క్రాంతి కుమార్ “శారద” చిత్రంతో మరో అవకాశం ఇవ్వగా, అది మ్యూజికల్ హిట్ కావడంతో చక్రవర్తి అందరి దృష్టిని ఆకర్షించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్. ప్రకాష్ రావు “ఇదా లోకం” చిత్రానికి, రాఘవేంద్ర రావు తొలి చిత్రం “బాబు”కు సంగీతం అందించారు. 1975లో ఎన్టీఆర్ నటించిన “అన్నదమ్ముల అనుబంధం” చిత్రానికి సంగీతం అందించడం చక్రవర్తి కెరీర్‌లో మరో మెట్టు. హిందీ రీమేక్ అయిన ఈ చిత్రానికి తెలుగులో హిందీ బాణీలకు తనదైన శైలిని జోడించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. 1977 అక్టోబర్ 21న విడుదలైన ఎన్టీఆర్ చిత్రం “యమగోల” చక్రవర్తి జాతకాన్ని మార్చేసింది. ఇందులోని ప్రతి పాటా హిట్టే. దాంతో ఎన్టీఆర్ అభిమానులు చక్రవర్తిని హక్కున చేర్చుకున్నారు. పదే పది నిమిషాలలో పాటకు బాణీ కట్టేసే చక్రవర్తి, అంత వేగంగా వేలకు వేల పాటలను స్వరపరచగలిగారు. “ప్రేమాభిషేకం” చిత్రంలోని కొన్ని పాటలను ఒకే ఒక్క రాత్రిలో కంపోజ్ చేశారు. “క్లాసికల్ సాంగ్స్” అవకాశాలు రాకపోయినా, తన సంగీతాన్ని “క్లాస్ సాంగ్స్”గా మలచుకుని “డ్రైవర్ రాముడు”, “కొండవీటి సింహం”, “బలిపీఠం”, “జేబు దొంగ” వంటి చిత్రాలకు చిరస్థాయిగా నిలిచిపోయే బాణీలను సమకూర్చారు.

నాలుగు తరాల హీరోలకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఘనత చక్రవర్తిది. ఏడాదికి 80 సినిమాలకు పనిచేసి చరిత్ర సృష్టించారు. 1973 నుంచి 1978 వరకు ఎన్నో మెలోడీలు అందించారు. “మూగ ప్రేమ”, “శారద”, “ఇదా లోకం”, “బలిపీఠం”, “జేబు దొంగ”, “బాబు”, “రాజా”, “ఖైదీ కాళిదాసు”, “దీపారాధన” వంటి అనేక చిత్రాలకు వినుసొంపైన పాటలు అందించారు. 1977లో “యమగోల” చిత్రం తర్వాత పూర్తి స్థాయి మాస్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. 1978లో వచ్చిన “16 ఏళ్ళ వయసు” చిత్రం ఆయన్ని క్లాస్‌కు, మాస్‌కు దగ్గర చేసింది. 1981, 1982 సంవత్సరాల నాటికి సంగీత దర్శకులు మహాదేవన్, సత్యంలను అధిగమించి, 1988 వరకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగారు. మొత్తం 959 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రవర్తి, మరో 41 సినిమాలు చేసి ఉంటే 1000 చిత్రాలతో అరుదైన రికార్డు నెలకొల్పి ఉండేవారు. కానీ ఆయన పెద్ద కొడుకు రాజేంద్ర ప్రసాద్ బైక్ యాక్సిడెంట్ లో మరణించడంతో షాక్ కు గురయ్యారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అలా 1989 నుంచి పూర్తిగా సినీ సంగీతానికి దూరమయ్యారు. 2002 ఫిబ్రవరి 3న రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి చక్రవర్తి కన్నుమూయడంతో ఒక సంగీత శకం ముగిసింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *