మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని పుణ్యక్షేత్రమైన చిత్రకూట్ సమీపంలోని దేవంగన లోయలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. రాజస్థాన్లోని కోటాలో నీట్ (NEET) కోచింగ్ తీసుకుంటున్న 20 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన బాధితురాలు సెలవుల్లో ఇంటికి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తన 17 ఏళ్ల స్నేహితురాలి ఆహ్వానం మేరకు చిత్రకూట్కు వెళ్లింది. బుధవారం (జూలై 22) మధ్యాహ్నం వారిద్దరూ దేవంగన లోయలోని కొండ ప్రాంతంలో తిరుగుతూ మొబైల్ వీడియోలు తీసుకుంటున్నారు. ఇంతలో బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు తాము అటవీ శాఖ ఉద్యోగులమని నమ్మించి బెదిరింపులకు దిగారు.
బెల్టుతో కొట్టి.. టవల్తో కట్టేసి..
ఆ దృశ్యాలను నిలదీసిన మైనర్ స్నేహితురాలిపై దుండగులు అరాచకానికి దిగారు. ఆమెను బెల్టుతో దారుణంగా బాది, కాళ్లు, చేతులను టవల్తో కట్టేసి నిర్మానుష్యమైన పొదల్లోకి తీసుకువెళ్లారు. అనంతరం, నీట్ విద్యార్థినిని నిర్జన ప్రదేశానికి బలవంతంగా ఈడ్చుకెళ్లి ముగ్గురు క్రిమినల్స్ సామూహిక లైంగిక దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ అటవీ ప్రాంతంలో దొరికిన నెట్వర్క్ సహాయంతో మైనర్ బాధితురాలు ఎలాగోలా కట్లు విప్పుకుని డయల్-112కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులు మోటార్సైకిల్పై పారిపోతున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
చిత్రకూట్ ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని, ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన ఇద్దరు నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..