ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027కు అన్ని జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2027 అక్టోబర్-నవంబర్లో జరిగే ఈ మెగా టోర్నీపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2027 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో తన డ్రీమ్ టీమ్ను ప్రకటించారు.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో ఓడిపోవడంతో జట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, అనుభవజ్ఞులతో పాటు కొందరు ఫామ్లో ఉన్న ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. శాస్త్రి ఎంపిక చేసిన జట్టుకు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయగా, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా స్థానం కల్పించారు. అలాగే యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ను కూడా తన టీమ్లోకి తీసుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉండగా, ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లను ఎంపిక చేశారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు కల్పించారు.
ఫొటో: రవిశాస్త్రి ప్రకటించిన డ్రీమ్ టీమ్
శాస్త్రి ఎంపిక చేసిన జట్టులో ఎక్కువ మంది ఇప్పటికే వన్డే ప్రపంచకప్ అనుభవం ఉన్న ఆటగాళ్లే. కీలక టోర్నీల్లో అనుభవం విజయానికి ఎంతో అవసరమని ఆయన నమ్మకాన్ని ఈ ఎంపిక స్పష్టం చేస్తోంది. అదే సమయంలో అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ వంటి కొత్త ముఖాలకు కూడా అవకాశం ఇచ్చారు. 2027 ప్రపంచకప్కు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉండటంతో, భారత జట్టు అనేక కలయికలను పరీక్షించే అవకాశం ఉంది. రాబోయే ద్వైపాక్షిక వన్డే సిరీస్లు, ఐసీసీ టోర్నీల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశమూ ఉంది. అయినప్పటికీ రవిశాస్త్రి ప్రకటించిన ఈ జట్టు ప్రస్తుతం భారత వన్డే జట్టు భవిష్యత్ రూపురేఖలపై ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి