Headlines

ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవాలకు ఖర్గే, రాహుల్ గాంధీ దూరం.. కారణం అదేనా..? | Improper protocol? Rahul Gandhi, Mallikarjuna Kharge skip Independence Day event at Red Fort again

ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవాలకు ఖర్గే, రాహుల్ గాంధీ దూరం.. కారణం అదేనా..? | Improper protocol? Rahul Gandhi, Mallikarjuna Kharge skip Independence Day event at Red Fort again


80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకాలేదు. వరుసగా రెండో ఏడాది కూడా ఇద్దరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూర్చునే ఏర్పాట్లు, ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అసంతృప్తితోనే కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వివాదానికి 2024లోనే బీజం పడింది. ఆ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీకి ముందు వరుసలో కాకుండా, చివరి వరుసకు ముందు వరుసలో సీటు కేటాయించడం వివాదానికి దారితీసింది. కేబినెట్ మంత్రి హోదాతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌కు ప్రోటోకాల్ ప్రకారం తగిన స్థానం కల్పించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఒలింపిక్ క్రీడాకారులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో సీటింగ్ ఏర్పాట్లలో స్వల్ప మార్పులు చేసినట్లు అప్పట్లో వివరణ ఇచ్చింది. దీంతో ప్రతిపక్ష నేతకు అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ స్థానం కల్పించాలనే అంశం చర్చకు వచ్చింది.

ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ప్రకారం స్థానం ఎక్కడ?

భారత ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రోటోకాల్‌లో ప్రతిపక్ష నేతకు ఉన్న హోదా ముఖ్యమైనది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలకు వారి హోదాకు అనుగుణంగా ప్రముఖ స్థానం కేటాయిస్తారు. అయితే ప్రతి కార్యక్రమంలో సీటింగ్ పూర్తిగా ఒకే విధంగా ఉండదు. కార్యక్రమ స్వభావం, హాజరయ్యే ప్రముఖులు, ప్రత్యేక అతిథులు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాల ఆధారంగా స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం.

ఇదిలా ఉంటే తాజా పరిణామాలు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న దూరాన్ని మరోసారి బయటపెట్టాయి. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ఇరుపక్షాల మధ్య తీవ్ర విభేదాలు కనిపించాయి. సభా కార్యకలాపాలు సజావుగా సాగకపోవడానికి ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

సమావేశాల అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన సంప్రదాయ టీ పార్టీకి కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు డుమ్మా కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎర్రకోట వేడుకలకు ఖర్గే, రాహుల్ గైర్హాజరు కావడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సీటింగ్ వివాదం కేవలం ప్రోటోకాల్ అంశమా.. లేక ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న రాజకీయ దూరానికి మరో సంకేతమా అన్న చర్చ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *