కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత్కు అనూహ్య ప్రశంసలు లభించాయి. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో భారత్ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల సరసన నిలిపారు. చైనా, రష్యాతో పాటు భారత్ను మూడు కీలక శక్తులుగా అభివర్ణించారు.
భారత్, చైనా, రష్యానే మూడు శక్తులు
SCO వేదికపై లుకాషెంకో మాట్లాడుతూ.. సభ్య దేశాలన్నీ సమానమే అయినప్పటికీ, చైనా, భారత్, రష్యా మూడు అత్యంత శక్తివంతమైన దేశాలని గుర్తించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మూడు దేశాలు ఆర్థికంగా బలమైనవి, వనరులు కలిగినవి, అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్లో అమెరికాను ఆ మూడు దేశాల జాబితాలో ప్రస్తావించకపోవడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించింది.
ఇరాన్పై దాడులపై SCO కీలక ప్రకటన
ఇదే సమయంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై SCO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తూ ‘బిష్కెక్ డిక్లరేషన్’ను సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధంగా ఉన్నాయని, అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయని ప్రకటన పేర్కొంది. అయితే భారత్ ఈ సంయుక్త ప్రకటనకు మద్దతు తెలిపింది. అయితే భారత్ తన ద్వైపాక్షిక ప్రకటనల్లో అమెరికా, ఇజ్రాయెల్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా.. ఇరాన్ సార్వభౌమత్వానికి మద్దతు, సమస్యలకు రాజకీయ-దౌత్య పరిష్కారమే మార్గమని తన వైఖరిని కొనసాగించింది.
ఉగ్రవాదంపై మోదీ స్పష్టమైన వైఖరి
SCO సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, కనెక్టివిటీ, అవకాశాలపై భారత్ ప్రాధాన్యతలను వివరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని భారత్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర నేతల సమక్షంలో మోదీ.. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మోదీ–పుతిన్ భేటీ.. కీలక చర్చలు
SCO సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, ఆర్థిక సహకారంతో పాటు పశ్చిమాసియా, బ్లాక్ సీ ప్రాంత పరిణామాలపై చర్చించారు. యుద్ధాలకు ముగింపు పలికి చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
మొత్తంగా బిష్కెక్ SCO సదస్సు.. భారత్ను కీలక ప్రపంచ శక్తిగా లుకాషెంకో అభివర్ణించడం, ఇరాన్ అంశంపై సంయుక్త ప్రకటన, ఉగ్రవాదంపై మోదీ స్పష్టమైన వైఖరి, రష్యా-చైనాలతో భారత్ దౌత్య చర్చలు వంటి పరిణామాలతో అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అలెగ్జాండర్ లుకాషెంకో వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..