ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాల్చడం వల్ల లేదా అవి మాడిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించడంతో, వైద్య నిపుణులు, ఆంకాలజిస్ట్లు దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించారు. నిపుణుల ప్రకారం..పిండి పదార్థాలు కలిగిన చపాతీలు, రొట్టెలు లేదా బంగాళాదుంపలు వంటి ఆహారాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు లేదా అవి నల్లగా మాడినప్పుడు వాటిలో అక్రిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి రసాయనాలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. జంతువులపై జరిపిన కొన్ని ప్రయోగశాల అధ్యయనాలలో ఈ రసాయనాలు శరీరంలో చేరడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, హోమియోపతి వైద్యులు ప్రస్తావిస్తూ, మాడిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందని హెచ్చరించడంతో ఈ వార్త వైరల్గా మారింది.
డాక్టర్లు వెల్లడించిన అసలు నిజం:
వైద్య నిపుణులు, ప్రపంచ క్యాన్సర్ పరిశోధనా సంస్థల ప్రకారం.. ఈ వైరల్ ప్రచారంలో అతిశయోక్తి ఎక్కువగా ఉంది. అక్రిలామైడ్ రసాయనం జంతువులలో క్యాన్సర్కు కారణం కావచ్చు కానీ, సాధారణంగా మనుషులు తినే ఆహార పరిమాణంలో ఇది క్యాన్సర్ కలిగిస్తుందనడానికి ఎటువంటి బలమైన లేదా స్థిరమైన రోగనిరోధక ఆధారాలు లేవు. క్యాన్సర్ అనేది ఏదో ఒక రోజు లేదా కొన్ని సార్లు మాడిన చపాతీలు తినడం వల్ల వచ్చేది కాదు. దానికి దశాబ్దాల పాటు నిరంతరం ఆ రసాయనాలు శరీరంలోకి అధిక మోతాదులో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి, ఎప్పుడైనా పొరపాటున మాడిన చపాతీ తింటే భయపడాల్సిన అవసరం లేదు.
చపాతీలపై ఉండే చిన్న చిన్న నల్లటి మచ్చల కంటే.. ధూమపానం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన చక్కెర వాడకం, నిద్రలేమి, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి వంటివే క్యాన్సర్కు ప్రధాన కారణాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అయితే, వైద్యుల ప్రకారం భయపడాల్సిన అవసరం లేనప్పటికీ, ముందుజాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాకుండా, పాత పద్ధతిలో పెనం మీద గుడ్డతో లేదా గరిటెతో ఒత్తుతూ కాల్చడం సురక్షితం. ఇది నేరుగా మంట తగలకుండా రక్షిస్తుంది. చపాతీలను నల్లగా లేదా ముదురు గోధుమ రంగులోకి మారేలా కాకుండా, లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేలా తక్కువ మంటపై కాల్చుకోవాలి. ఒకవేళ చపాతీలు ఎక్కువ కాలితే, తినే ముందు ఆ నల్లగా మాడిన భాగాలను చేత్తో తీసివేసి మిగిలిన భాగాన్ని తినవచ్చు. మీ రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే, వాటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే టాక్సిన్స్ను సహజంగానే తొలగిస్తాయి.