పేదవాడి కారుగా గుర్తింపు పొందిన టాటా నానో మళ్లీ మార్కెట్లోకి రానుందనే చర్చ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో గట్టిగా వినిపిస్తోంది. టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నానో రీఎంట్రీపై సానుకూలంగా స్పందించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
ఒకప్పుడు పేదవాడి కారుగా గుర్తింపు పొందిన నానో, ఆ తర్వాత ఆదరణ తగ్గడంతో ఉత్పత్తి ఆగిపోయింది. అయినప్పటికీ దీని పేరు భారతీయ కార్ల అభిమానుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో తరచూ నానో కొత్త రూపంలో వస్తోందంటూ ఫొటోలు, ఏఐ డిజైన్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ చేసిన కామెంట్స్తో నానో రీఎంట్రీపై మరోసారి ఆసక్తి విపరీతంగా పెరిగింది.
టాటా డిజైన్ హెడ్ ఏమన్నారంటే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాటా నానోను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉందా అని టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్కు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ, నానోను మళ్లీ ప్రపంచానికి పరిచయం చేయడం తనకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఆ కారు ఎలక్ట్రిక్ రూపంలో రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నానో ఈవీ తయారీ గురించి టాటా మోటార్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఆయన కామెంట్స్ను కంపెనీ అధికారిక ప్రకటనగా భావించలేమని స్పష్టమవుతోంది.
ఇప్పటి మార్కెట్ ట్రెండ్
టాటా నానో 2009లో తక్కువ ధరలో కారు అందించాలనే లక్ష్యంతో భారత మార్కెట్లోకి వచ్చింది. అయితే మార్కెట్లో దీనిని కేవలం చౌకైన కారుగా చూడటం దాని విజయానికి కొంత అడ్డంకిగా మారింది. చాలా మంది వినియోగదారులు కొంచెం ఎక్కువ డబ్బు వెచ్చించి పెద్ద హ్యాచ్బ్యాక్ కొనేందుకు ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ విపరీతంగా పెరిగింది.
చిన్న సైజు, నగర ప్రయాణాలకు సరిపోయే వాహనాలను వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుగా నానో తిరిగి వస్తే మంచి స్పందన లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ ఇప్పటికే టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి మోడళ్లతో తన సత్తా చాటుతోంది. భవిష్యత్తులో నానో ఈవీ రూపంలో వస్తే తొలిసారి కారు కొనేవారిని, బైక్ నుంచి కారుకు మారాలనుకునేవారిని ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.