రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయుల కష్టాలివి. పాఠశాలకు వెళ్లే మార్గంలో ఉన్న తూకమర్రి వాగు.. వర్షాలు కురిసిన ప్రతిసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగిపొర్లితే అటు వైపు వెళ్లేందుకు దారి ఉండదు.. ఇటు వైపు నుంచి పాఠశాలకు చేరుకునే పరిస్థితి ఉండదు. తాజాగా వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహిళా ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ సాయంతో వాగు దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాగు మధ్యలోకి వెళ్లగానే ట్రాక్టర్ ఇసుకలో కూరుకుపోయింది. ట్రాలీ ఒక్కసారిగా ఒరిగిపోయింది. అందులో మహిళా ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు చంటిపిల్లలు కూడా ఉన్నారు.
ఊహించని ఘటనతో టీచర్లు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని మరో ట్రాక్టర్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. సుమారు అరగంట పాటు శ్రమించిన తర్వాత ఎట్టకేలకు ఉపాధ్యాయులు సురక్షితంగా వాగు దాటి పాఠశాలకు చేరుకున్నారు. వీర్నపల్లి కస్తూర్బా టీచర్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని.. తూకమర్రి వాగుపై సురక్షితమైన వంతెన నిర్మించాలని స్థానికులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.