పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. గొల్లగుప్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో మృతి చెందడం ఏజెన్సీని కలచివేస్తుంది. అనారోగ్యం బారినపడి అత్యంత తక్కువ రోజుల్లోనే చిన్నారులు మృతి చెందడంతో ఏజెన్సీలో వైద్య సేవలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిర్లక్ష్యంతో పాటు వైద్య శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. బాలిక శుక్రవారం మృతి చెందగా.. ఇప్పటి వరకు డేట్ రిపోర్ట్ నమోదు చేయలేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు చిన్నారుకు భద్రాచలం ఆసుపత్రిలో మలేరియాతో వైద్యం పొందుతున్నారు.