Headlines

విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. | Big Relief for International Passengers: Bureau of Immigration To Stops Boarding Pass Stamps From September 1


భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేసే విధానాన్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నూతన నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు ఇకపై పేపర్ బోర్డింగ్ పాస్‌లను మాత్రమే వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తమ స్మార్ట్‌ఫోన్‌లలోని డిజిటల్ లేదా ఈ-బోర్డింగ్ పాస్‌లను ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించి క్లియరెన్స్ పొందవచ్చు. ఒకవేళ ఎవరైనా ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ తీసుకెళ్లినా, అధికారులు వాటిని పరిశీలిస్తారు తప్ప ఎలాంటి స్టాంపులు వేయరు.

గతంలో బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ సరిగ్గా పడకపోవడం లేదా ఇతర వివరాలు కనిపించకుండా ముద్ర పడటం వంటి కారణాలతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రయాణికులకు సమయం ఆదా చేసేందుకే స్టాంపింగ్ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సెక్యూరిటీ చెకింగ్ సమయంలో బోర్డింగ్ పాస్ స్టాంపింగ్‌ను నిలిపివేసింది. అయితే కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే ఇమ్మిగ్రేషన్ వద్ద ఈ నిబంధన కొనసాగుతూ వచ్చింది. తాజా నిర్ణయంతో సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ వద్ద కూడా ఈ ప్రక్రియ పూర్తిగా రద్దు కానుంది.

మరో కీలకమైన మార్పు దిశగా కూడా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అడుగులు వేస్తోంది. భారత పౌరుల పాస్‌పోర్టులపై ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు వేసే విధానాన్ని కూడా తొలగించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో పాస్‌పోర్ట్ స్టాంపింగ్‌ను కూడా రద్దు చేసే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *