కారు, బస్సు వంటి వాహనాలకు డ్రైవర్ స్టీరింగ్ తిప్పితే వాహనం ఎడమ లేదా కుడివైపు మలుపు తిరుగుతుంది. కానీ వందే భారత్ రైలుకు అలాంటి స్టీరింగ్ వీల్ ఉండదు. అయినప్పటికీ వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు అధిక వేగంతో ప్రయాణిస్తూ మలుపులను సులభంగా దాటుతుంది. కొన్ని రైలు ఇంజెన్స్లో లోకో పైలెట్ ముందు స్టీరింగ్ లాంటి చక్రం ఒకటి ఉన్నా.. అది స్టీరింగ్ కాదు. కొన్ని రైళ్లలో లోకో పైలట్ దగ్గర కనిపించే చక్రం బ్రేక్ కంట్రోల్ వీల్. మరి స్టీరింగ్ లేకుండా దాని చక్రాలు మలుపుల్లో ఎలా అటూ ఇటూ తిరుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైల్వే ట్రాక్ను గమనిస్తే అది ఎప్పుడూ నేరుగా ఉండదు. అవసరమైన చోట ట్రాక్ను ముందుగానే వంపుతో నిర్మిస్తారు. రైలు చక్రాలు ఆ పట్టాలపై అమర్చబడి ఉండటంతో రైలు ట్రాక్ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణిస్తుంది. అందువల్ల డ్రైవర్ స్టీరింగ్ తిప్పాల్సిన అవసరం ఉండదు. రైలు చక్రాల ఆకారం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. చక్రం మొత్తం వెడల్పులో ఒకే వ్యాసంతో ఉండదు. దాని ఉపరితలం స్వల్పంగా కోనాకారంగా ఉంటుంది. ఈ డిజైన్ కారణంగా మలుపుల్లో చక్రాల మధ్య సహజమైన వ్యత్యాసం ఏర్పడి రైలు సాఫీగా వంపును అనుసరిస్తుంది.
బోగీలు ఎలా సహాయపడతాయి?
రైలు కోచ్ కింద బోగీలు ఉంటాయి. వాటిలో చక్రాలు, యాక్సిల్స్ వంటి భాగాలు అమర్చబడి ఉంటాయి. ఈ బోగీలు ట్రాక్ ఆకారానికి అనుగుణంగా కొంతవరకు సర్దుబాటు అవుతూ మలుపులను దాటేందుకు సహాయపడతాయి. ఆధునిక రైళ్లలో బోగీ డిజైన్ను వేగం, స్థిరత్వం, ప్రయాణికుల సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. వందే భారత్ ట్రెయిన్సెట్ కూడా నిర్దిష్ట రేడియస్ ఉన్న వంపులను సురక్షితంగా దాటేలా రూపొందించబడింది. భారత రైల్వే స్పెసిఫికేషన్లలో వందే భారత్కు సంబంధించిన వంపులు, టర్న్ఔట్లు, సూపర్ ఎలివేషన్, క్యాంట్ వంటి అంశాలకు నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి.
మరి మరో ట్రాక్కు ఎలా వెళ్తుంది?
ఇక్కడ పాయింట్స్ లేదా టర్న్ఔట్స్ కీలకంగా పనిచేస్తాయి. రైల్వే ట్రాక్ రెండు మార్గాలుగా విడిపోయే ప్రాంతంలో ప్రత్యేకంగా కదిలే పట్టాలను ఏర్పాటు చేస్తారు. వాటిని మార్చడం ద్వారా రైలును ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్పైకి మళ్లిస్తారు. భారత రైల్వే ప్రకారం ప్రస్తుతం అనేక పాయింట్లు మోటార్ల ద్వారా నిర్వహించబడుతూ, ఇంటర్లాకింగ్ వ్యవస్థతో భద్రపరచబడతాయి. అంటే తప్పు మార్గంలో రైలు వెళ్లకుండా సిగ్నలింగ్, పాయింట్స్ వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి.
డ్రైవర్ పని ఏంటి?
అంటే రైలుకు దిశను డ్రైవర్ నేరుగా స్టీరింగ్తో మార్చడు. డ్రైవర్ వేగం, బ్రేకింగ్, సిగ్నల్స్, ట్రాక్ పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైలును నియంత్రిస్తాడు. రైలు ఏ దిశలో వెళ్లాలనేది ప్రధానంగా ట్రాక్ లేఅవుట్, పాయింట్స్, సిగ్నలింగ్ వ్యవస్థ నిర్ణయిస్తాయి. అందుకే వందే భారత్ రైలుకు స్టీరింగ్ లేకపోయినా ఎలాంటి సమస్య ఉండదు. కారు రోడ్డును అనుసరించినట్లే.. రైలు పట్టాలను అనుసరిస్తుంది. తేడా ఏమిటంటే, రైలు చక్రాలు–బోగీలు–పట్టాల ఇంజినీరింగ్ కలిసి రైలుకు మలుపు తిరిగే సామర్థ్యాన్ని అందిస్తాయి.