CWG 2026 : గ్లాస్గోలో అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ క్రీడా రంగానికి మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర అవమానం ఎదురైంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్ కుద్రతుల్లా టీమ్ హోటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పరారయ్యాడు. ఈ ఘటనతో పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (PBF) మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు ముగిసిన తర్వాత పాకిస్థాన్ అథ్లెట్లు విదేశీ భూభాగంలో పారిపోవడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ప్రతి పెద్ద టోర్నమెంట్ ముగిశాక పాక్ బాక్సర్లు అక్కడక్కడే ఉండిపోవడం లేదా పారిపోవడం పరిపాటిగా మారింది.
పాస్పోర్ట్ ఉన్నా కూడా బురిడీ కొట్టించి పరార్
పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ వర్గాల సమాచారం ప్రకారం.. కుద్రతుల్లా కామన్వెల్త్ గేమ్స్లో తన వెయిట్ కేటగిరీ పోటీల్లో పాల్గొని ఓడిపోయిన తర్వాత టీమ్ హోటల్ నుంచి మాయమయ్యాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. కుద్రతుల్లా పాస్పోర్ట్ టీమ్ మేనేజర్ వద్దే సురక్షితంగా డిపాజిట్ అయి ఉంది. అయినప్పటికీ ఆయన భద్రతా సిబ్బందిని, మేనేజ్మెంట్ను బురిడీ కొట్టించి పారిపోయాడు. ఆదివారం నాడే జట్టు స్కాట్లాండ్ నుంచి తిరిగి బయలుదేరాల్సి ఉండగా, మరో ఆరు గంటల్లో ప్రయాణం ఉందనగా ఆయన కనిపించకుండా పోయాడు. ఆ రోజు ఉదయం హోటల్ లాబీలో ఆటగాళ్లందరూ కలిసిన సమయంలో కుద్రతుల్లా రాకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలోనూ పలువురు క్రీడాకారుల జంపింగ్ జపాంగ్
విదేశాల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు పారిపోవడం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022 సమయంలో కూడా సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ అనే ఇద్దరు బాక్సర్లు ఇదే తరహాలో మాయమయ్యారు. ఆ సమయంలో కూడా వారి పాస్పోర్టులు మేనేజర్ల వద్దే ఉండటం గమనార్హం. అలాగే, ఇటలీలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ 2024 సమయంలో ఏషియన్ గోల్డ్ మెడల్ విజేత జొహైబ్ రషీద్ తన రూమ్మేట్ విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను దొంగిలించి రాత్రికి రాత్రే పరారయ్యాడు.
ఒకే ఒక్క కాంస్య పతకంతో తీవ్ర నిరాశ
ఇక కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాకిస్థాన్ ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగింది. మొత్తం 36 మంది క్రీడాకారులు మరియు అధికారులతో కూడిన పాకిస్థాన్ బృందం గ్లాస్గోకు వెళ్లగా, లభించిన పతకాలు మాత్రం ఒక్కటే. మహిళా బాక్సర్ ఫాతిమా జెహ్రా సాధించిన ఏకైక కాంస్య పతకంతో పాక్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రీడల్లో ఘోర వైఫల్యానికి తోడు, ఇలా ఆటగాడు పారిపోవడంతో పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు తీవ్ర విమర్శలపాలవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..