పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బులను తొలి విడతగా ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. అయితే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా తొలి విడతలో డబ్బులు పొందని వారికి, అలాగే ఈసారి కొత్తగా స్కూళ్లలో చేరి తల్లికి వందనం డబ్బులు అందని వారికి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది.
తొలి విడతలో అర్హులై ఉండి డబ్బులు రాని విద్యార్థుల జాబితాను గుర్తించి.. సామాజిక తనిఖీల కోసం గత నెల 21నే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాలు/గ్రామ, వార్డుల్లో అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆధారాలతో సహా సమర్పిస్తే.. వాటిని పరిశీలించి రెండో విడతలో వారి అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఇందుకు ఈ నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులను కూడా స్వీకరించింది.
ఇందుకుగాను మొత్తం 4,470 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరి అర్హతలను మరోసారి పరిశీలించి.. ఈ నెల 30వ తేదీన ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల జాబితాలను అధికారులు విడుదల చేస్తారు. అదే సమయంలో తల్లికి వందనం తొలి విడత డబ్బులు పొందని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్నారు.
మీరు ‘తల్లికి వందనం’ పథకం పొందాలనుకుంటే క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
-
విద్యార్థి కుటుంబానికి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి.
-
10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు.
-
కుటుంబంలో ఎవరికీ ఫోర్ వీలర్ (నాలుగు చక్రాల) వాహనం ఉండకూడదు.
-
నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటకూడదు.
-
పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు పైగా ఇల్లు/స్థలం ఉండకూడదు.
-
ఆదాయ పన్ను (ఇన్కమ్ ట్యాక్స్) చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.