బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ మరింత బలపడుతున్న నేపథ్యంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు 15కు పైగా రాష్ట్రాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ వైపు కదిలింది. అనంతరం గంగా మైదాన ప్రాంతాలు, జార్ఖండ్ వైపు కదిలే అవకాశం ఉందని అంచనా. రాబోయే గంటల్లో ఈ వ్యవస్థ మరింత బలపడితే విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో 204.5 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారులు ముంపునకు గురికావడం, రవాణాకు అంతరాయం కలగడం, నదులు, వాగుల్లో నీటిమట్టం పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడొచ్చు. జార్ఖండ్లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకుండా, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, కేరళ, కొంకణ్-గోవా, మధ్య మహారాష్ట్ర, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, ఈదురుగాలులు..
భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి చురుకుగా కొనసాగుతుండటంతో పాటు పశ్చిమ అవాంతరం ప్రభావం కూడా ఉండటంతో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరగవచ్చని అంచనా. రైతులు పంటలను సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవడంతో పాటు పశువులను ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని అధికారులు హెచ్చరించారు. మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశంలో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.