ఖమ్మం నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్క టాయిలెట్ పోసిందనే ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగనాయకుల గుట్టకు చెందిన దండేటి శ్రీనాథ్ (24) అనే యువకుడు ఫ్లెక్సీ వర్కర్గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం (ఆగస్టు 13) రాత్రి 10:30 గంటల సమయంలో శ్రీనాథ్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక ఆటోలో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో, అదే ప్రాంతానికి చెందిన వేముల మధు (28) తన పెంపుడు కుక్కను వాకింగ్ కోసం బయటకు తీసుకువచ్చాడు.
ఆ సమయంలో కుక్క, శ్రీనాథ్ కూర్చున్న ఆటో వద్ద టాయిలెట్ పోసింది. దీంతో కోపానికి గురైన శ్రీనాథ్, మధును గట్టిగా ప్రశ్నించాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన మధు, వెంటనే సమీపంలో ఉన్న తన ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకువచ్చాడు. శ్రీనాథ్పై ఐదుసార్లు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
కత్తిపోట్లకు గురైన శ్రీనాథ్ సమీపంలోని కాలువలో రక్తం మడుగులో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై ఏసీపీ స్పందిస్తూ.. మృతుడు శ్రీనాథ్, నిందితుడు మధులకు మధ్య ఎలాంటి పాత కక్షలు గానీ, పరిచయం గానీ లేవని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల ప్రభావం ఏమీ లేదని, కేవలం కుక్క టాయిలెట్ పోసిన విషయంలో క్షణికావేశంలో జరిగిన గొడవే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు వేముల మధు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..