
నేపాల్ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 700 మంది చనిపోగా మరో మూడు వేల మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఐదు రోజులవుతున్నా నేపాల్ లో పరిస్థితులు మారలేదు. సుమారు లక్ష మంది పై వరద ప్రభావం పడింది. బోటేకోషి నదీ తీరంలో నివాసాలు కొట్టుకుపోయాయి. ఉన్న నివాసాలు బురదలో కూరుకు పోయాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజల కోసం ఆర్మీ సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. నది పరివాహక ప్రాంతాల్లో 40 కి.మీ మేర రోడ్లు కొట్టుకుపోయాయి. 19 వంతెనలు ధ్వంసం అయ్యాయి..విద్యుత్, తాగు నీటి వ్యవస్థలు దెబ్బతిన్నాయి..ఈ వరద పరిస్థితుల నుంచి తేరుకోవాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.
ఇక గల్లంతైన వారిలో 33 దేశాలకు చెందిన ప్రజలున్నారు. భారత్ కి చెందిన 275 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కేంద్రంమంత్రిత్వ శాఖ ప్రకారం.. 50 మంది భారతీయులతో సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. నేపాల్ లో 108 మంది భారతీయులను సిబ్బంది రక్షించారు.. గత నాలుగు రోజులుగా సంప్రదించలేని సుమారు 50 మంది భారతీయుల ఆచూకీ తెలిసింది. గత రెండు రోజుల్లో 598 మంది భారత జాతీయులు చైనా నుండి నేపాల్ కి చేరుకున్నారు. మరో 900 మంది భారతీయులు చైనా లో సురక్షితంగా ఉన్నారు. నేపాల్ , చైనా రెండు వైపులా సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన వారిలో చాలా మంది భారతీయులు ఉన్నందున, వరదల వల్ల ప్రభావితమైన వారి త్వరితగతిన సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం నేపాల్ , చైనా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 24 గంటలూ పనిచేసే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కాఠ్మండు, బీజింగ్లలోని మన రాయబార కార్యాలయాలు 24/7 హెల్ప్లైన్లను నిర్వహిస్తున్నాయి.ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన భారతీయులకు సంబంధించి, గాలింపు, సహాయక పునరావాస చర్యల కోసం కాఠ్మండు బీజింగ్లలోని భారత రాయబార కార్యాలయాలు కూడా సంబంధిత భాగస్వాములందరితో సంప్రదింపులు జరుపుతున్నాయి. కైలాష్ మానసరోవర్ యాత్ర నుండి నేపాల్ మీదుగా తిరిగి వస్తున్న భారతీయ పౌరుల ప్రయాణాన్ని పర్యవేక్షిస్తూ, భారత ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది ..భారతీయులకు సహాయాన్ని అందించడానికి భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది.
నేపాల్ సహాయక చర్యల్లో భారత బృందాలు
వరదలతో కుదేలైన నేపాల్ కి భారత్ మానవతా సహాయాన్ని అందిస్తుంది. NDRF ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. భారత సైన్యానికి చెందిన 18 మంది సభ్యుల సొరంగ సహాయక పరిశీలన బృందం, 6-గురు సభ్యుల వైద్య బృందం, మృతదేహాలను గుర్తించడానికి డిఎన్ఎ నమూనాల విశ్లేషణలో సహాయపడటానికి 6 ఫోరెన్సిక్ బృందాలతో కూడిన 19 మంది సభ్యుల బృందం నేపాల్ వెళ్ళాయి. మొత్తం 43 మంది వివిధ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు..దీంతో పాటు
గడిచిన ఐదు రోజుల్లో నాలుగు వాయుసేన విమానాల ద్వారా అత్యవసర సహాయక సామగ్రిని నేపాల్కు పంపి తక్షణ మానవతా సహాయాన్ని భారత్ అందించింది. ఇప్పటివరకు, సుమారు 68.5 టన్నుల సహాయక భారత్ నేపాల్ కి అందించింది. తాత్కాలిక షెల్టర్లు, దుప్పట్లు, పరిశుభ్రతా కిట్లు, సోలార్ లైట్లు మందులు, నీటిని తొలగించే పంపులు, వంట సామాగ్రి, జెన్సెట్టులు ఆహార పదార్థాలు డిగ్నిటీ కిట్లు, నీటి శుద్ధి మాత్రలను నేపాల్ పంపింది. నేపాల్ అవసరాలకు అనుగుణంగా భారత్ సహాయాన్ని అందిస్తుంది..రోడ్ల అనుసంధానాన్ని పునరుద్ధరించడానికి సహాయక చర్యలలో తోడ్పడటానికి బెయిలీ వంతెనలు, సంబంధిత సాంకేతిక బృందాలను భారత్ నేపాల్ పంపింది. అదనపు బెయిలీ వంతెనలు వంతెనల నిర్మాణానికి కావలసిన సామగ్రితో 16 ట్రక్కులను భారత్ నేపాల్ పంపింది..
భారత్ సాయంపై నేపాల్ స్పందన..
సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ, భారతదేశం చేసిన ప్రయత్నాలపై నేపాల్ స్పందించింది.. అసాధారణ ఉదారతగా అభివర్ణించింది. నపునర్నిర్మాణం కోసం ఉదారంగా సహాయం అందిస్తామని న్యూఢిల్లీ సూచించిందని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే అన్నారు.
మృత్యుంజయురాలు..
కాగా.. నేపాల్ను అతలాకుతలం చేసిన వరదల మధ్య 97 ఏళ్ల గుణ మాయ బోహరా మృత్యుంజయురాలిగా నిలిచారు . వైరల్ అవుతున్న ఒక వీడియోలో, బోహరా ఒక ఎక్స్కవేటర్ షవల్ లోపల కూర్చుని కనిపిస్తారు. బురదతో నిండిన ఆమె బట్టలు, ముఖంలోని అలసట వరదల వల్ల జరిగిన విధ్వంసాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తిన తర్వాత, బోహరా తాను ఉంటున్న సంరక్షణ గృహం శిథిలాల కింద చిక్కుకుపోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..