Headlines

రాయలసీమలో లిథియం, గాలియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తింపు..


రాయలసీమలో లిథియం, గాలియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తింపు..

రాయలసీమను రత్నగర్భ అని పిలుస్తారు. ఇప్పటికే ఈ ప్రాంతం సున్నపురాయి, యురేనియం వంటి అనేక ఖనిజాలకు ప్రసిద్ధి. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన, భవిష్యత్తు సాంకేతికతకు అవసరమైన లిథియం, గాలియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు కనుగొనబడింది. కడప బేసిన్‌లో 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వేంపల్ల ఫార్మేషన్ పరిధిలో నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్.జి.ఆర్.ఐ) శాస్త్రవేత్తలు ఈ రెండు ఖనిజాలను గుర్తించారు. ఇక్కడి నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించగా, గరిష్టంగా టన్నుకు 1000 పీపీఎం లిథియం, 250 పీపీఎం గాలియం నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, రక్షణ పరికరాలు వంటి ఆధునిక పరిశ్రమలకు లిథియం, గాలియం కీలకమైనవి. ఈ కీలక ఖనిజాల అన్వేషణను మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్.ఎం.ఈ.టి)కు 140 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అనంతరం, రాష్ట్ర గనుల శాఖతో కలిసి ఎన్.జి.ఆర్.ఐ మెగా సర్వేను ప్రారంభించింది. భూగర్భంలో ఈ ఖనిజాలు ఎంత విస్తీర్ణంలో, ఎంత లోతులో ఉన్నాయో తెలుసుకోవడానికి శాటిలైట్ మ్యాపింగ్, జియో ఫిజికల్ సర్వే, కోర్ డ్రిల్లింగ్, ల్యాబ్ టెస్టింగ్ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ ఆవిష్కరణ రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చగలదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *