శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: శ్రీకాకుళం జిల్లాలోని పెదపాడు పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబేడ్కర్ గురుకులంలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు సరదాగా వేసుకున్న పందెం ప్రమాదకరంగా మారింది. ఫ్లోర్ క్లీనింగ్కు ఉపయోగించే లైజాల్ తాగిన ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం రాత్రి స్టడీ అవర్ పూర్తయిన తర్వాత ముగ్గురు విద్యార్థినులు తమ గదికి వెళ్తున్న సమయంలో ఫ్లోర్ క్లీన్ చేసేందుకు ఉపయోగించే లైజాల్ డబ్బాను గమనించినట్లు సమాచారం. దాన్ని తాగితే ఏమీ కాదంటూ ఒకరితో ఒకరు పందెం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థినులు కొద్దిమొత్తంలో లైజాల్ తాగగా.. మరో విద్యార్థిని ఎక్కువగా తాగినట్లు సమాచారం.
లైజాల్ తాగిన సుమారు అరగంట తర్వాత ఎక్కువ మొత్తంలో తీసుకున్న విద్యార్థినికి వాంతులు మొదలయ్యాయి. దీంతో రాత్రి 11 గంటల సమయంలో ఈ విషయాన్ని గురుకులం యాజమాన్యానికి తెలియజేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది విద్యార్థినిని పరిశీలించి, చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై గురుకులం ప్రిన్సిపాల్ పద్మావతిని వివరణ కోరగా.. ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఉపయోగించే లైజాల్ ఓ గ్లాస్లో ఉండిపోవడంతో విద్యార్థిని మంచినీరు అనుకుని పొరపాటున తాగిందని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. మరోవైపు దళిత సంఘాల నాయకులు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించారు.
ఇవి కూడా చదవండి
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలు, గురుకులాల్లో క్లీనింగ్ కెమికల్స్, ఇతర ప్రమాదకర ద్రావణాలను విద్యార్థులకు అందుబాటులో లేకుండా భద్రపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీటి గ్లాసులు లేదా బాటిళ్లలో ఇలాంటి రసాయనాలను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.