ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పరిధిలోని ఉప్పుటేరు వంతెన సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఉప్పుటేరు నుంచి మందపాడు వెళ్లే రహదారి పక్కన ఉన్న తుప్పల్లో దుప్పట్లో చుట్టి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో, ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో దుండగులు మరెక్కడో హత్య చేసి, మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి తీసుకొచ్చి ఇక్కడి తుప్పల్లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్..
మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 38 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ చేరుకుని కీలక ఆధారాలు సేకరించాయి. మహిళ వివరాలు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డీఎస్పీ రఘువరన్ విష్ణు నేతృత్వంలో పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మహిళ గుర్తింపు కార్డులు లేదా ఇతర ఆధారాల కోసం గాలిస్తున్నారు.
పూర్తి వివరాల దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని సీఐ కాళీ చరణ్ మీడియాకు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ శవమై తేలడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..