వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా ప్రయాణించి, అక్కడి నుండి ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ వెదర్ అప్డేట్ :-
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబ్నగర్ జిల్లా, కరీంనగర్, కామారెడ్డి, హనుమకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 5 మి.మీ. లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచనలు:-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..