Headlines

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!


Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

యాదాద్రి జిల్లా భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబౌతోంది. ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా ఆటల్లో మునిగిపోయారు. నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే ఊహించని ప్రమాదంతో చిన్నారుల ఆనందం కాసేపటికే విషాదంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉన్న 50 ఏళ్ల నాటి భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే పలువురు విద్యార్థులు చెట్టు కింద చిక్కుకున్నారు. క్షణాల్లోనే ఆటల మైదానం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆటలాడుతున్న చిన్నారులపై ఒక్కసారిగా భారీ చెట్టు కొమ్మ విరిగిపడటంతో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో కొందరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

హాలీమాకు తప్పని విషాదం..

ఈ ఘటనలో మూడో తరగతి చదువుతున్న హాలీమా తీవ్రంగా గాయ పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్నారుల కాళ్లు విరిగి తీవ్ర గాయాల య్యాయి. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.

ఆరు నెలల క్రితమే హెచ్చరికలు..

ఈ ఘటనపై స్థానికుల తీవ్రంగా స్పందించారు. ప్రమాదానికి గురైన వేపచెట్టులో ఆరు నెలల క్రితం లోపలి భాగంలో మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారనీ చెబుతున్నారు. అయితే చెట్టు అంతర్భాగం కాలిపోవడంతో అది బలహీనపడిందని అప్పుడే ఫైర్ సిబ్బంది హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా ప్రమాదకరంగా మారిన చెట్టును తొలగించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

పాఠశాల అంటే పిల్లలకు భద్రమైన ప్రదేశం కావాలి. కానీ అదే పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా మారిన చెట్టు ఉండటం.. ముందే దాని పరిస్థితిపై హెచ్చరికలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హాలీమా ఇక తిరిగిరాదు. కానీ మరో హాలీమా ప్రాణం పోకుండా ఉండాలంటే ఇప్పటికైనా పాఠశాలల ఆవరణలోని ప్రమాదకర చెట్లు, భవనాలు, విద్యుత్‌ లైన్లు తదితర వాటిపై అధికారులు సమగ్ర తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శ..

ఈ ఘటనలో మృతి చెందిన మూడో తరగతి విద్యార్థిని హలీమా కుటుంబాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శించారు. ఆ కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. మరోవైపు ఈ ఘటంలో గాయపడిన చిన్నారులను ఎయిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *