ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బుధవారం నాటికి ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ విషయానికొస్తే.. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం, బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని సూచించింది.
ఏపీకి రెడ్ అలర్ట్ జారీ
భోగాపురం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, చోడవరం, వేపాడ, ఎస్ కోట వంటి ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక చిత్తూరు, తిరుపతి, నగరి, సత్యవేడు, పుతతూరు, కన్నవరం వంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఇక పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
తెలంగాణలో రెండ్రోజుల పాటు వానలు
ఇక తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కాగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఎల్నివో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు విస్తరించినా అనుకున్నంతగా వర్షాలు పడలేదు. కానీ గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి.