
ఒక్క సెల్ఫీ కోసం చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడబోయిన యువకుడిని అక్కడున్న పర్యాటకులు చాకచక్యంగా కాపాడారు. చేతిలో ఎలాంటి రెస్క్యూ సామగ్రి లేకపోవడంతో చీరలు, బట్టలను కలిపి తాడుగా తయారు చేసి అతడిని బయటకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర పుణె సమీపంలోని మాళ్శేజ్ ఘాట్ ప్రాంతంలో ఉన్న కాలూ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. వర్షాకాలం కావడంతో జలపాతం అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వచ్చారు. వారిలో ఓ యువకుడు జలపాతం దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
మంచి ఫొటో రావాలనే ప్రయత్నంలో జలపాతం అంచుకు మరింత దగ్గరగా వెళ్లాడు. అయితే వర్షంతో బండరాళ్లు జారుడుగా ఉండటంతో ఒక్కసారిగా అతడి కాలు జారింది. దీంతో యువకుడు లోయ వైపు జారిపోయాడు. కింద భారీగా నీరు ప్రవహిస్తుండటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ కిందకు జారుతున్న సమయంలో యువకుడికి ఓ బండరాయి దొరికింది. వెంటనే దాన్ని గట్టిగా పట్టుకుని అక్కడే వేలాడుతూ ఉండిపోయాడు. చేయి జారితే నేరుగా నీటి ప్రవాహంలో పడిపోయే పరిస్థితి. దీంతో అతడి ప్రాణాలు కొన్ని క్షణాల పాటు గాల్లోనే వేలాడాయి.
వీడియో చూడండి..
యువకుడి పరిస్థితిని గమనించిన పర్యాటకులు వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ తాడు లేదా ఇతర రెస్క్యూ పరికరాలు అందుబాటులో లేవు. దీంతో అక్కడున్న మహిళల చీరలు, ఇతరుల బట్టలను ఒకదానికొకటి కట్టి పొడవైన తాడుగా తయారు చేశారు. ఆ బట్టల తాడును యువకుడి వైపు పంపించి అతడిని పట్టుకునేలా చేశారు. అందరూ కలిసి జాగ్రత్తగా పైకి లాగడంతో చివరకు యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.
వర్షాకాలంలో జలపాతాలు, ఘాట్ ప్రాంతాలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరంగా కూడా మారుతాయి. బండరాళ్లు జారుడుగా ఉండటం, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడం వల్ల చిన్న పొరపాటు కూడా ప్రాణాల మీదకు రావచ్చు. సోషల్ మీడియాలో పెట్టే ఒక్క సెల్ఫీ కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.