గోదావరి జిల్లాల్లో లభించే పులస చేపలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ దొరికే పులస చేపలను ఎంత ఖర్చైనా సరే వేలంలో కొని విదేశాలకు పంపిస్తుంటారు జనాలు. అయితే తాజాగా కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు కేజీన్నర బరువున్న అరుదైన పులస చేప చిక్కగా, దాన్ని యానాం మార్కెట్లో వేలం వేయడంతో రూ. 20 వేల భారీ ధర పలికింది. ఈ చేపను జి.వి. అనే వ్యక్తి రూ. 20 వేలు వెచ్చించి దక్కించుకున్నారు. అనంతరం ఆయన వేరొక వ్యక్తి ద్వారా ఈ ప్రత్యేకమైన చేపను సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి పంపించినట్లు మత్స్యకారులు తెలిపారు.
తగ్గని పులస క్రేజ్
గోదావరి జిల్లాల వాసులకు పులస చేప అంటే ఎనలేని మక్కువ. ఈ చేప దొరికితే చాలు, ధరతో సంబంధం లేకుండా ఎంత మొత్తమైనా వెచ్చించి కొనుగోలు చేసి, విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న తమ బంధువులకు పంపించడం ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. యానాం గోదావరి పులస కోసం స్థానికులే కాకుండా మెగాస్టార్ లాంటి ప్రముఖ సినీ హీరోలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని, వీరి కొనుగోళ్లతో పులసకు క్రేజ్ మరింత పెరిగిందని గోదావరి జిల్లా వాసులు భావిస్తున్నారు.
ఈ ఏడాది దొరక్క దొరుకుతున్న పులస చేపలు వేల రూపాయల ధర పలుకుతుండటంతో, “పులస మజాకానా” అంటూ స్థానిక ప్రజలు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.