హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే పాతబస్తీలోని ప్రముఖ షాదాబ్ హోటల్పై TG SAFE (ఫుడ్ సేఫ్టీ) అధికారులు లైసెన్స్ సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది.
TG SAFE బృందం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో షాదాబ్ హోటల్ కిచెన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలం చెల్లిన పదార్థాలు, పురుగుల బెడద, తీవ్ర అపరిశుభ్రత మధ్య వంటకాలు తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉండటంతో హోటల్ లైసెన్స్ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, పంజాగుట్టలోని ఏషియాటిక్ కేఫ్, బాగ్లింగంపల్లిలోని డ్రీమ్జ్ క్యాఫెటీరియాలపై కూడా చర్యలు తీసుకుని వాటిని మూసివేశారు.
ఈ తనిఖీలు కేవలం వంటగది శుభ్రతకే పరిమితం కాకుండా, మనం తింటున్న మాంసం అసలు సిసలైనదేనా అనే పెద్ద ప్రశ్నను లేవనెత్తాయి. తక్కువ ధరకు మటన్ ఇస్తామంటూ ఇతర జంతువుల మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నిల్వ ఉంచిన మాంసాన్ని రసాయనాలు, ఘాటైన మసాలాలు కలిపి మళ్లీ వండుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
మాంసం స్లాటర్ హౌస్ నుంచి బయలుదేరి వ్యాపారుల వద్దకు, అక్కడ నుండి హోటల్ కిచెన్ మీదుగా కస్టమర్ ప్లేట్కు చేరుకునే వరకు ప్రతీ దశలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అధికారులు కేవలం హోటల్ వంటగదులను తనిఖీ చేయడమే కాకుండా, మాంసం ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? బిల్లులు ఉన్నాయా? సరైన కోల్డ్ స్టోరేజ్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేశారా? అనే అంశాలను కూడా లోతుగా విచారించాలి. ఆహార భద్రతా అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తేనే ప్రాణాంతక కల్తీ రక్కసికి అడ్డుకట్ట పడుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..