Headlines

Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది? | Air India Flight Incident: A320 Neo Lost Key Flight Controls for 4 Seconds, Fell 300 Feet

Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది? | Air India Flight Incident: A320 Neo Lost Key Flight Controls for 4 Seconds, Fell 300 Feet


Air India A320 Neo: ఫుకెట్‌ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా A320 నియో విమానంలో చోటుచేసుకున్న తీవ్ర భద్రతా ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడానికి ముందు దాని మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో వరుసగా లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎయిర్‌బస్‌ డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (బ్లాక్‌ బాక్స్‌) నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించగా.. విమానంలోని ఎలివేటర్లు, ఎయిలరాన్లు సహా కీలక నియంత్రణ ఉపరితలాలు దాదాపు 4 సెకన్ల పాటు ఒకేసారి పనిచేయలేదని తెలుస్తోంది. అదే హైడ్రాలిక్‌ వైఫల్యం కారణంగా స్పాయిలర్లు కూడా పనిచేయలేదని సమాచారం.

4 సెకన్ల పాటు నియంత్రణ కోల్పోయిన విమానం

విమాన నియంత్రణలో ఎలివేటర్లు, ఎయిలరాన్లు, స్పాయిలర్లు అత్యంత కీలకం. ఎలివేటర్లు విమానం ముక్కు భాగాన్ని పైకి, కిందికి కదిలించేందుకు, ఎయిలరాన్లు విమానాన్ని ఎడమ, కుడి వైపులకు వంచేందుకు ఉపయోగపడతాయి. స్పాయిలర్లు లిఫ్ట్‌ను తగ్గించడంతో పాటు డ్రాగ్‌ను పెంచి విమానం వేగాన్ని తగ్గించడంలో, దిగడంలో సహాయపడతాయి. అయితే మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో వరుస వైఫల్యాల తర్వాత ఈ నియంత్రణ వ్యవస్థలు స్పందించకుండా పోయినట్లు ప్రాథమిక డేటా సూచిస్తోంది. ఆ సమయంలో ఎలివేటర్లు, ఎయిలరాన్లు పైలట్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే కదిలినట్లు సమాచారం.

ఆటోపైలట్‌ డిస్‌కనెక్ట్‌.. స్టాల్‌ హెచ్చరికలు

ఈ పరిణామాల మధ్య విమానం ఆటోపైలట్‌ వ్యవస్థ డిస్‌కనెక్ట్‌ అయింది. అదే సమయంలో విమాన వ్యవస్థలు స్టాల్‌ హెచ్చరికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విమానం రెక్కలు తగినంత లిఫ్ట్‌ను ఉత్పత్తి చేయలేని పరిస్థితినే స్టాల్‌ అంటారు. ఇది విమానానికి అత్యంత ప్రమాదకర పరిస్థితి. విమానాన్ని నియంత్రించేందుకు ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్న కో-పైలట్‌ తన సైడ్‌స్టిక్‌ను ముందుకు నెట్టారు. స్టాల్‌ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు విమానం ముక్కు(ముందు భాగం)ను కిందికి దించి వేగాన్ని, లిఫ్ట్‌ను పునరుద్ధరించడం సాధారణ విధానం.

అయితే హైడ్రాలిక్‌ పవర్‌ అందుబాటులో లేకపోవడంతో కో-పైలట్‌ ఇచ్చిన ఆదేశాలు వెంటనే విమానం ముక్కు కిందికి కదిలేలా చేయలేకపోయినట్లు సమాచారం. కొన్ని సెకన్ల తర్వాత మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు తిరిగి పనిచేయడంతో విమానంపై నియంత్రణ పునరుద్ధరించబడింది.

ప్రయాణికులు, సిబ్బందికి గాయాలు

హైడ్రాలిక్‌ వ్యవస్థలు తిరిగి పనిచేసిన తర్వాత విమానం ఒక్కసారిగా తీవ్రంగా కిందికి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఆకస్మిక కదలిక కారణంగా విమానంలోని ప్రయాణికులు, క్యాబిన్‌ సిబ్బందిలో పలువురు తమ సీట్ల నుంచి పైకి ఎగిరి విమానం పైకప్పును ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఎయిర్‌బస్‌కు చేరిన బ్లాక్‌ బాక్స్‌ డేటా

సుమారు 7.8 ఏళ్ల వయసున్న A320 నియో విమానానికి సంబంధించిన సాంకేతిక డేటాను ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌బస్‌ శాశ్వత సాంకేతిక సహాయ కేంద్రం AIRTACకు పంపినట్లు సమాచారం. ఫ్రాన్స్‌లోని టులూజ్‌లో ఉన్న ఈ కేంద్రం 24 గంటలూ, ఏడాది పొడవునా పనిచేస్తుంది. విమానంలోని కొంత డేటా ACARS (Aircraft Communications Addressing and Reporting System) ద్వారా ఎయిర్‌బస్‌కు చేరి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌లోని పూర్తి సమాచారాన్ని విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఎయిర్‌లైన్‌ డౌన్‌లోడ్‌ చేసి, అత్యవసర విశ్లేషణ కోసం ఎయిర్‌బస్‌కు పంపినట్లు సమాచారం.

ఆగస్టు 5 అర్ధరాత్రి తర్వాత ఎయిర్‌బస్‌ ప్రాథమిక నివేదికను ఎయిర్‌ ఇండియాకు పంపినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన 15–16 గంటల్లోనే ఈ ప్రాథమిక విశ్లేషణ అందింది.

ప్రెజర్‌ సెన్సర్‌ లోపమే కారణమా?

ప్రాథమిక నివేదికలో విమానంలోని హైడ్రాలిక్‌ వ్యవస్థకు సంబంధించిన ఒక ప్రెజర్‌ సెన్సర్‌ లేదా హైడ్రాలిక్‌ ప్రెజర్‌ స్విచ్‌లో లోపం ఉండే అవకాశం ఉందని ఎయిర్‌బస్‌ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇదే ఘటనకు తుది కారణమని ఇప్పటివరకు నిర్ధారించలేదు. ఎయిర్‌బస్‌ కూడా ఇంకా తుది సాంకేతిక సిఫార్సులు జారీ చేయలేదు.

ఇదిలా ఉండగా ఎయిర్‌బస్‌ నిపుణులతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ BEA నిపుణులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం వారు విమానాన్ని, దాని వివిధ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు సమాచారం. ఈ భౌతిక పరిశీలనలో లభించిన కొత్త వివరాలను భారత AAIB (Aircraft Accident Investigation Bureau)కు అందించినట్లు తెలుస్తోంది.

పైలట్‌ వ్యవహారంపైనా దర్యాప్తు

మరోవైపు విమాన కమాండర్‌ కెప్టెన్‌ సుదీప్‌ వశిష్ఠ వ్యవహారంపైనా దర్యాప్తు కొనసాగుతోంది. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఆయనకు నిర్వహించిన రెండు యూరిన్‌ పరీక్షల్లో మారిజువానా గుర్తించినట్లు సమాచారం. విమానంలో ఉన్న ఒక క్యాబిన్‌ సిబ్బంది సభ్యుడు.. పైలట్‌ అంతకుముందు ‘పాట్‌’ (మారిజువానా) వాడినట్లు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది.

అయితే పైలట్‌ పరీక్షల్లో మారిజువానా గుర్తించిన అంశానికి, ఫుకెట్‌–ఢిల్లీ విమానంలో చోటుచేసుకున్న సాంకేతిక ఘటనకు ప్రస్తుతం ప్రత్యక్ష సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు నిర్ధారించలేదు. ఈ అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది.

అందరు పైలట్లకు డ్రగ్‌ టెస్టులు

కెప్టెన్‌ వశిష్ఠ పరీక్షల్లో మారిజువానా(డ్రగ్) గుర్తించిన నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థల్లోని అన్ని పైలట్లకు తప్పనిసరిగా డ్రగ్‌ టెస్టు లునిర్వహించాలని ఆదేశించింది. నిషేధిత పదార్థాలు లేదా అనుమతించని మందులు వారి శరీరంలో లేవని నిర్ధారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

అయితే ఫుకెట్‌–ఢిల్లీ విమానంలో చోటుచేసుకున్న అసలు సాంకేతిక లోపానికి కారణం ఏమిటనేది ఇంకా తేలాల్సి ఉంది. మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు ఒకేసారి ఎందుకు విఫలమయ్యాయి? ప్రెజర్‌ సెన్సర్‌ లోపమే దీనికి కారణమా? లేక మరేదైనా వ్యవస్థలో లోపం ఉందా? అనే అంశాలపై AAIB దర్యాప్తు కొనసాగిస్తోంది. తుది నివేదిక వెలువడిన తర్వాతే ఘటనకు పూర్తి కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *