దేశంలో సుకన్య సమృద్ది యోజన పథకం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుమార్తెల భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది మంచి సేవింగ్స్ స్కీముగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పొదుపు పథకం నడుస్తుండటంతో.. డబ్బులకు భద్రత ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్తో లింక్ అయి ఉండకపోవడంతో మీరు పెట్టే పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు.
ప్రస్తుతం సుకన్య సమృద్ది యోజన పథకం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే ఈ పథకానికి సంబంధించి చాలామందిలో అనేక అనుమానాలు ఉంటాయి. ఎన్నారైలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే ఎన్నారైలకు ఈ పథకంలో చేరడానికి అనుమతి లేదు. భారతదేశంలో నివసిస్తు్నవారు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టడానికి అర్హులు.
దీంతో విదేశాల్లో నివాసం ఉండే భారతీయులు తమ కుమార్తె పేరు మీద సుకన్య సమృద్ది యోజన అకౌంట్ తెరవలేరు. అయితే ఈ పథకంలో చేరాలంటే ఖచ్చితంగా బాలిక వయస్సు 10 సంవత్సరాల్లోపు ఉండాలి. బాలిక భారతదేశ నివాసి అయి ఉండాలి. బాలిక పేరు మీద అకౌంట్ తెరిచాక.. తల్లిదండ్రులు చట్టబద్దమైన సంరక్షలుగా దానిని నిర్వహించవచ్చు. బాలిక లేదా ఆమె కుటుంబం దేశంలో నివాసి కాకపోతే ఈ అకౌంట్ తెరవలేరని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే ఒక వ్యక్తి ఎన్నారై కాకముందు తన కుమార్తె పేరు మీద అకౌంట్ తెరిస్తే నిబంధనలు వేరుగా ఉంటాయి. అప్పటికి తెరిచిన అకౌంట్కు సంబంధించిన నిబంధనలను తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవాలి. అయితే ఈ పథకం వడ్డీ రేటును కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. దీంతో భవిష్యత్తులో వడ్డీ రేటు మారితే మరింత ఆదాయం పొందవచ్చు. చక్రవడ్డీ పద్దతిలో వడ్డీ లెక్కించడం వల్ల ఎక్కువ ఆదాయం లభిస్తుంది.
కుమార్తె వయస్సు 10 ఏళ్లలోపు ఉన్నప్పుడు వారి పేరుపై ఈ అకౌంట్ తెరవడం వల్ల లాభం ఉంటుంది. భవిష్యత్తులో వారి చదువులు, పెళ్లిళ్లకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. దీని వల్ల తల్లిదండ్రులకు కూడా ఆర్ధిక భారం తగ్గుతుంది. ఎన్నారైలకు ఈ అవకాశం లేకపోవడం వల్ల ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల కోసం ఆన్వేషించాలి.




