Headlines

UPI Payments: యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..? ఈ సందర్భాల్లో సాధ్యమే.. ఎలా అంటే..? | UPI Transaction Limit: Know How Much Money You Can Send in a Day and When 5 Lakh Is Allowed


ప్రస్తుత కాలంలో యూపీఐను దేశంలో ఎక్కువమంది వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నవారి ఫోన్లలో ఏదోక యూపీఐ యాప్ అనేది ఉంటుంది. యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయడం, నగదు స్వీకరించడం, యుటిలిటీ బిల్లులు పే చేయడం లాంటి లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో యూపీఐ అనేది బాగా పాపులర్ అయింది. రోజూ రికార్డ్ స్థాయిలో దీని ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపించవచ్చనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా ఒక రోజులో రూ.లక్ష పంపించుకోవచ్చనేది అందరికీ తెలిసిన విషయమే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక రోజులో రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. ఆ లిమిట్ దాటితే సాధారణ ట్రాన్సాక్షన్లు చేయలేరు.

రూ.5 లక్షల వరకు లిమిట్..

కానీ కొన్ని ప్రత్యేక సందర్బాల్లో రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో పేమెంట్స్ కూడా యూపీఐ ద్వారా చేయవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ, ఎన్‌పీసీఐ నిబంధనలు అనుమతిస్తున్నాయి. ట్యాక్స్ పే చేయడం, ఐపీఓలో యూనిట్స్ కొనుగోలు చేయడం, ఆస్పత్రి బిల్లులు, విద్యాసంస్థలకు పేమెంట్స్ చేయడం లాంటి సందర్బాల్లో రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించవచ్చు. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే సమయంలో రూ.5 లక్షల వరకు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఇక ఐపీవో దరఖాస్తులు, ఆర్బీఐ రిటైలర్ డైరెక్ట్ స్కీమ్ పేమెంట్లకు కూడా వర్తిస్తుంది. అలాగే ఆస్పత్రులు, విద్యాసంస్థలకు చెల్లించే బిల్లులకు కూడా రూ.5 లక్షల లిమిట్ వర్తిస్తుంది.

యూపీఐ లైట్ ద్వారా ఎంతవరకు చేయవచ్చు..?

ఇక యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా ఒక రోజులో రూ.5 వేల వరకు పేమెంట్స్ చేయవచ్చు. ఒక యూపీఐ 123లో రూ.10 వేల వరకు ఒక రోజులో లావాదేవీలు నిర్వహించవచ్చు. యూపీఐ 123 ద్వారా ఫీచర్ ఫోన్ ద్వారా కూడా యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఆర్బీఐ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకపోయినా కూడా దీని ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. IVR నంబర్లు, ఫీచర్ ఫోన్‌లలో యాప్ , మిస్డ్ కాల్-బేస్డ్ విధానం, ప్రాగ్జిమిటీ సౌండ్-బేస్డ్ పేమెంట్స్ వంటి విధానాల ద్వారా యూపీఐ పేమెంట్స్ సులువుగా చేయవచ్చు. ఇక సాధారణ పరిమితికి మించి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేయాలంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి విధానాలను ఉపయోగించుకోవాలి. ఈ విధానాల ద్వారా ఎంత మొత్తంలో అయినా డిజిటల్‌గా బదిలీ చేయవచ్చు. చిన్న లావాదేవీలకు యూపీఐ ఉపయోగపడుతుంది. అదే పెద్ద మొత్తంలో పంపించాలంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి విధానాలను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *